మళ్లీ మొదలైన వైరం .. పద్మా వర్సెస్​ మైనంపల్లి

 మళ్లీ మొదలైన వైరం  ..  పద్మా వర్సెస్​ మైనంపల్లి
  •  మళ్లీ మొదలైన రాజకీయ వైరం  
  •  మొదటి నుంచీ ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలే 
  •  ఎన్నికల నేపథ్యంలో మరోమారు పంచాయితీ


మెదక్​, వెలుగు : అధికార పార్టీ కి చెందిన మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మల్కాజ్​గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మధ్య మరోసారి వార్ మొదలైంది. గతంలో  ఆంధ్రప్రదేశ్ లో  వేర్వేరు పార్టీలో ఉన్నప్పటి నుంచే  వీరిద్దరి మధ్య రాజకీయ వైరం ఉంది. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక మైనంపల్లి మెదక్ నియోజకవర్గం నుంచి మల్కాజ్​గిరికి షిఫ్ట్ కావడంతోపాటు, టీఆర్​ఎస్​ పార్టీలో చేరడంతో విభేదాలు సద్దుమణిగాయి.   మైనంపల్లి ఈసారి మళ్లీ మెదక్​ నియోజకవర్గం పై దృష్టి పెట్టడంతో  ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య మళ్లీ రాజకీయ యుద్ధం మొదలైంది. ఉమ్మడి రాష్ట్రంలో పద్మా దేవేందర్​ రెడ్డి టీఆర్ఎస్​ పార్టీలో, మైనంపల్లి   తెలుగు దేశంలో పార్టీలో ఉన్నారు. 
 

చిన్నశంకరంపేట మండలానికి చెందిన హన్మంతరావ్​ 2004 ఎన్నికల్లో రామాయంపేట అసెంబ్లీ స్థానంలో పోటీ చేయాలని ఆశించారు. అయితే కొన్ని కారణాలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకు కాకుండా ఆయన భార్య మైనంపల్లి వాణికి టికెట్​ కేటాయించారు.  ఈ క్రమంలో   కేసీఆర్​ కూడా  మహిళా అభ్యర్థిని బరిలో దించాలని భావించి రామాయంపేట జడ్పీటీసీగా ఉన్న పద్మాదేవేందర్ రెడ్డికి టీఆర్​ఎస్ టికెట్​ ఇచ్చారు. ​అప్పటి నుంచే  పద్మా దేవేందర్​ రెడ్డి, మైనంపల్లి  రాజకీయ విరోధులుగా మారారు.

 ఆ ఎన్నికల్లో పద్మా దేవేందర్ రెడ్డి రామాయంపేట ఎమ్మెల్యేగా గెలిచారు.  ఆ తర్వాత తెలంగాణా సాధన ఉద్యమంలో భాగంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనువార్యమయ్యాయి.  2008లో జరిగిన ఉప ఎన్నికల్లో  పద్మపై  మైనంపల్లి హన్మంతరావ్​ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 
 

2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో రామాయంపేట నియోజకవర్గం రద్దయి  ఆ నియోజకవర్గంలోని పలు మండలాలు మెదక్ నియోజకరవర్గంలో కలిశాయి. ఈ క్రమంలో ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నుంచి పోటీకి టీఆర్​ఎస్​ తరపున పద్మా దేవేందర్​ రెడ్డి, టీడీపీ తరపున హన్మంతరావ్​ పోటీకి సిద్దమయ్యారు. కాగా ఆ ఎన్నికల్లో టీడీపీ, టీఆర్​ఎస్​ పొత్తు పెట్టుకొని మహాకూటమిగా ఏర్పడగా  మెదక్ స్థానాన్నిటీడీపీకీ కేటాయించారు. దీంతో హన్మంతరావ్​కు టికెట్​ దక్కగా, భంగపడ్డ పద్మాదేవేందర్​ రెడ్డి రెబెల్ అ భ్యర్థిగా బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో మైనంపల్లి విజయం సాధించారు. వరుసగా రెండు ఎన్నికల్లో పద్మా దేవేందర్​ రెడ్డి మైనంపల్లి మీద పోటీచేసి ఓటమి చవిచూశారు. 

మైనంపల్లి మల్కాజ్​గిరికి వెళ్లడంతో...

2014లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించాక మైనంపల్లి హన్మంతరావ్​ మెదక్​ నుంచి హైద్రాబాద్​ మల్కాజ్​గిరి కి షిఫ్ట్ అయ్యారు. టీడీపీ నుంచి టీఆర్​ఎస్​లో చేరి లోక్​సభ ఎన్నికల్లో ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన టీఆర్​ఎస్​ పార్టీ గ్రేటర్​ హైద్రాబాద్​ అధ్యక్షులు అయ్యారు. అనంతరం ఎమ్మెల్సీ పదవి దక్కింది. 2018 ఎన్నికల్లో మల్కాజ్​గిరి అసెంబ్లీ స్థానంలో పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. మైనంపల్లి మల్కాజ్​గిరికి మారాక మెదక్​ లో పద్మాదేవేందర్​ రెడ్డికి తిరుగు లేకుండా పోయింది. వరుసగా 2014, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 

పదేళ్ల తర్వాత అనూహ్యంగా రీ ఎంట్రీ

మల్కాజ్​ గిరికి వెళ్లిపోయిన మైనంపల్లి దాదాపు పదేళ్ల తరువాత అనూహ్యంగా గత ఫిబ్రవరిలో మళ్లీ మెదక్ సెగ్మెంట్​లో రీ ఎంట్రీ ఇచ్చారు. తన కొడుకు మైనంపల్లి సోషల్​ సర్వీస్​ ఆర్గనైజేషన్​ చైర్మెన్​ డాక్టర్​ మైనంపల్లి రోహిత్​ ను రానున్నఎన్నికల్లో బీఆర్​ఎస్​ అభ్యర్థిగా పోటీ చేయించే ఆలోచనతో విస్తృతంగా సోషల్​ సర్వీస్​ చేపట్టారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల బీఆర్​ఎస్​ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులను  తన వైపు తిప్పుకున్నారు.   

మైనంపల్లి రీఎంట్రీతో మెదక్ సెగ్మెంట్​లో పద్మాదేవేందర్​ రెడ్డికి ఆయనకు మధ్య మళ్లీ రాజకీయ వైరం మొదలైంది. బీఆర్​ఎస్​ అధిష్టానం పద్మా దేవేందర్​రెడ్డికే టికెట్​ ఇవ్వడంతో మైనంపల్లి  రగిలిపోతున్నారు. తన కొడుకును మెదక్​ లో పోటీ చేయించి తీరుతానని ఆయన ప్రకటించడంతో రాజకీయం రసవత్తరంగా మారింది.