- సీట్లు దక్కని, ఫస్ట్ లిస్టులో పేర్లు లేని నేతల అసంతృప్తి
- హైదరాబాద్లో ‘వేరే మొగోడు దొరకలేదా?’ అంటూ రాజాసింగ్ కామెంట్
- మల్కాజ్గిరి సీటు దక్కలేదని మురళీధర్ రావు గుర్రు
- నాగర్కర్నూల్ టికెట్ దక్కలేదని బంగారు శృతి మనస్తాపం
- నిరాశలో డీకే అరుణ, జితేందర్రెడ్డి, సోయం బాపూరావు
హైదరాబాద్, వెలుగు: బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనతో పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. టికెట్లు ఆశించి భంగపడిన కొందరు, ఫస్ట్ లిస్టులో పేర్లు లేవని మరికొందరు సీనియర్లీడర్లు హైకమాండ్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాలుగైదు నియోజకవర్గాల నుంచి కొందరు సీనియర్లీడర్లు టికెట్ ఆశించారు. అయితే వాళ్లను కాదని కొత్త వారికి టికెట్లు ఇవ్వడంతో ఆ నేతలందరూ అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్, మల్కాజ్గిరి, నాగర్కర్నూల్, జహీరాబాద్ టికెట్ల ప్రకటనపై పార్టీ లీడర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇద్దరు ముగ్గురు లీడర్లు పార్టీ మారేందుకూ సన్నాహాలు చేసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తున్నది. మరోవైపు ఫస్ట్ లిస్టులో పేర్లు లేకపోవడంపై మరికొందరు లీడర్లు నారాజ్ అవుతున్నారు. తమ నియోజకవర్గాలను పెండింగ్ లో పెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రాజాసింగ్అసంతృప్తి..
హైదరాబాద్టికెట్ను విరించి ఆసుపత్రి చైర్మన్మాధవీలతకు కేటాయించడంపై గోషామహల్ఎమ్మెల్యే రాజాసింగ్తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. ఈటికెట్రేసులో ముందు నుంచి రాజాసింగ్కూడా ఉన్నారు. టికెట్కోసం ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. అయితే మాధవీలతకు టికెట్ఇవ్వడంతో ఆయన అసంతృప్తికి లోనైనట్టు చెబుతున్నారు. అసలు పార్టీలో చేరకముందే మాధవీలతకు టికెట్ఎట్ల ఇస్తారని రాజాసింగ్ ప్రశ్నించినట్టు తెలుస్తున్నది.
హైదరాబాద్స్థానం నుంచి అసదుద్దీన్ఒవైసీపై పోటీ చేసేందుకు ‘వేరే మొగోడు ఎవరూ దొరకలేదా?’ అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. నిజానికి కొద్ది రోజులుగా రాజాసింగ్పార్టీ కార్యక్రమాలకు దూరంగాఉంటున్నారు. బీజేఎల్పీ నేత పదవి వస్తుందని ఆశలు పెట్టుకోగా, అది ఇవ్వకపోవడంతోనే రాజాసింగ్ అసహనానికి లోనైనట్టు పార్టీ నేతలు చెబుతున్నారు.
మురళీధర్రావు అలక..
మల్కాజిగిరి టికెట్కోసం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు గట్టిగానే ప్రయత్నాలు చేశారు. కానీ ఆ టికెట్ ఈటల రాజేందర్కు ఇచ్చారు. దీంతో మురళీధర్ రావు అసహనంతో ఉన్నారు. తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరిచారు. ‘‘గత కొన్నేండ్లుగా నా సహచరులు, పార్టీ కార్యకర్తలు, నా బాగు కోరుకునేవాళ్లంతా అండగా నిలిచారు. మల్కాజ్ గిరి పార్లమెంట్సెగ్మెంట్లో పార్టీ కార్యక్రమాలు, ప్రచారాల్లో నా వెన్నంటి ఉన్నారు. వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. త్వరలోనే కార్యకర్తలందరితో సమావేశమవుతాను. భవిష్యత్కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటాను’’ అని సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ఇది వైరల్గా మారింది. టికెట్రాకపోవడంతోనే ఆయన ఇలా పోస్టు పెట్టారని, పార్టీ మారుతారా? అని చర్చ నడుస్తున్నది.
నిరాశలో డీకే అరుణ, జితేందర్ రెడ్డి..
పార్టీ సీనియర్ లీడర్లు డీకే అరుణ, జితేందర్రెడ్డి కూడా తొలి విడత టికెట్ల ప్రకటనపై కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. మహబూబ్నగర్టికెట్కోసం పోటీ పడుతున్న వీళ్లిద్దరూ.. టికెట్తమకే వస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఫస్ట్ లిస్టులోనే పేరు ఉంటుందని భావించారు. అయితే, ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉండడంతో ఆ స్థానాన్ని హైకమాండ్ హోల్డ్లో పెట్టింది. ఒకరికి మహబూబ్నగర్ టికెట్ఇచ్చి, మరొకరిని వేరే స్థానం నుంచి బరిలోకి దింపాలని అధినాయకత్వం యోచించింది.
అయితే దానిపై ఇద్దరు నేతలతో మాట్లాడితే, ఎవరూ ఒప్పుకోలేదని తెలుస్తున్నది. ఈ క్రమంలోనే మహబూబ్నగర్ టికెట్ను హోల్డ్లో పెట్టింది. ఈ నిర్ణయంపై ఇద్దరు నేతలు అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇక జహీరాబాద్టికెట్ను బీబీ పాటిల్కు ఇవ్వడంపై ఆలె నరేంద్రకుమారుడు ఆలె భాస్కర్, మాజీ మంత్రి బాగారెడ్డి కుమారుడు జైపాల్రెడ్డి రాష్ట్ర నాయకత్వం వద్ద నిరసన తెలిపినట్టు తెలుస్తున్నది.
టికెట్ ఇవ్వకుంటే నా దారి నేను చూసుకుంట: ఎంపీ సోయం
ఆదిలాబాద్, వెలుగు: తనకు ఎంపీ టికెట్ రాకుండా పార్టీ ముఖ్య నేతలే కుట్ర పన్నుతున్నారని ఎంపీ సోయం బాపురావు ఆరోపించారు. తాను రెండోసారి గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవి వస్తుందని, అది ఇష్టంలేకనే టికెట్ ఇవ్వకుండా అడ్డుతగులుతున్నారని ఫైర్అయ్యారు. ఆదివారం ఆదిలాబాద్జిల్లా కేంద్రంలోని తన ఇంట్లో మీడియాతో బాపూరావు చిట్చాట్చేశారు.
‘‘నేను ఆదివాసీ లీడర్ గా సొంతంగా ఎదిగాను. ఎవరికీ తలొగ్గే పరిస్థితి లేదు. జిల్లాలో బీజేపీని గెలిపించిందే నేను. అలాంటి నాకు టికెట్ ఇవ్వకుండా వేరే పార్టీ నుంచి వచ్చే వారికి టికెట్ ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు” అని ఆయన వాపోయారు. ‘‘గత ఎన్నికల సమయంలో ఎంపీ టికెట్ కోసం ఒక్కరూ ముందుకురాలేదు. కానీ ఇప్పుడు నాకు వ్యతిరేకంగా రావడం సిగ్గుచేటు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ల గెలుపు కోసం ఎంతో కష్టపడ్డాను. సెకండ్ లిస్టు లో టికెట్ ఇవ్వకుంటే నా దారి నేను చూసుకుంటాను” అని చెప్పారు.
సీఎం రేవంత్ తో బంగారు శృతి భేటీ..
నాగర్కర్నూల్టికెట్పై పార్టీ జనరల్సెక్రటరీ బంగారు శృతి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు ఆ టికెట్ఆమెకే అని అంతా అనుకున్నారు. అయితే, ఈ వారం రోజుల్లో రాజకీయ పరిస్థితులు తారుమారయ్యాయి. బీఆర్ఎస్సిట్టింగ్ఎంపీ రాములు బీజేపీలో చేరడం, ఆయన కుమారుడు పోతుగంటి భరత్కు నాగర్ కర్నూల్ టికెట్ఇవ్వడంతో శృతి మనస్తాపం చెందారు. ఈ క్రమంలోనే ఆమె పార్టీ మారేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తున్నది. ఆదివారం సీఎం రేవంత్రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఇది మర్యాదపూర్వక భేటీనే అని చెప్తున్నప్పటికీ, శృతి కాంగ్రెస్లో చేరడం దాదాపు ఖాయమైందని సమాచారం. నాగర్కర్నూల్టికెట్ ఆమెకు ఇచ్చేందుకు కాంగ్రెస్సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తున్నది.