- 9 ఏండ్ల కింద రూ.50 కోట్లతో జీ+5 మోడల్లో కమాండ్ సెంటర్కు శ్రీకారం
- 2021 ఏడాదిలో బిల్డింగ్ పూర్తిచేసేలా కాంట్రాక్ట్
- రూ.3.53 కోట్ల బిల్స్ రాలేదని ఫినిషింగ్ వర్క్స్ ఆపిన కాంట్రాక్టర్
వరంగల్, వెలుగు: వరంగల్ పోలీస్ కమిషనరేట్లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభానికి అడుగుదూరంలోనే ఆగిపోయింది. కమిషనరేట్లో పెరుగుతున్న క్రైమ్రేట్నియంత్రణ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించాలనే లక్ష్యంతో 9 ఏండ్ల కింద జీ+5 అంతస్తుల భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2021 నాటికే పనులు పూర్తి కావాల్సి ఉండగా, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో నిర్మాణం నిలిచిపోయింది. ఖర్చులు పెరగడంతో ప్రణాళికలోని మూడు అంతస్తులను తగ్గించి, ముందుగా రెండు అంతస్తుల్లోనే సేవలు ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే పెండింగ్ బిల్లుల కారణంగా కాంట్రాక్టర్ ఫినిషింగ్ పనులను నిలిపివేయడంతో ప్రాజెక్టు ఆగిపోయింది.
2017 మే 29న పనులకు శంకుస్థాపన..
వరంగల్ పోలీస్ కమిషనరేట్ 2015 జూన్ 12 నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలకు చెందిన సుమారు 5,672 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 24 లక్షల జనాభాకు సేవలందిస్తోంది. 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పనిచేస్తున్న ఈ కమిషనరేట్లో క్రైమ్ రేట్ పెరగకుండా చూడటం పెద్దసవాల్గా మారింది. రైల్వే మార్గాలు విస్తృతంగా ఉండటంతో నేరగాళ్ల చలనం ఎక్కువగా ఉండటం సమస్యగా ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ తరహాలో అన్ని విభాగాలు ఒకేచోట పనిచేసే విధంగా 2017 మే 29న కమాండ్ కంట్రోల్ సెంటర్కు శంకుస్థాపన చేశారు.
సెంటర్లోని భారీ స్క్రీన్పై గల్లీగల్లీ కనిపించేలా..అత్యాధునిక సదుపాయాలు
వరంగల్ కమిషనరేట్లో ప్రస్తుతం ఒక్కో ఆఫీస్ఒక్కో చోట ఉంది. అలా కాకుండా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే పోలీస్ కమిషనర్ ఆఫీస్, డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, కాన్ఫరెన్స్ హాల్స్, వీడియో కాన్ఫరెన్స్ హాల్, సిటీ స్పెషల్ బ్రాంచ్, ఐటీ కోర్ టీమ్, లీగల్ విభాగం, పీఆర్వో ఆఫీస్, రికార్డు గదులు వంటి అన్ని విభాగాలను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు. బెల్జియం, జర్మనీ వంటి దేశాల నుంచి డేటా సెంటర్ పరికరాలు తీసుకురావాలని భావించారు. నగరంలోని సుమారు 60 వేల సీసీ కెమెరాలను అనుసంధానం చేసి, మూడు విభాగాలుగా విభజించి భారీ ఎల్ఈడీ స్క్రీన్పై గల్లీగల్లీ పరిస్థితులను పర్యవేక్షించేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
గత సర్కార్ బిల్లులియ్యక..
కమిషనరేట్ బిల్డింగ్మొత్తం 76,801 స్క్వేర్ ఫీట్లతో జీ+5 అంతస్తుల్లో ఉండేలా ప్రణాళిక రూపొందించారు. అయితే, 2021 వరకు పనులు పూర్తి చేయాలని చెప్పిన గత సర్కార్ సకాలంలో నిధులివ్వకపోవడంతో నిర్మాణ ఖర్చు పెరిగింది. నిధుల కొరతతో మూడు అంతస్తులను తగ్గించారు. మొదటగా రెండు అంతస్తుల్లో 41,281 స్క్వేర్ ఫీట్లలో నిర్మాణం చేపట్టారు. కడపకు చెందిన సిద్దార్థ కన్స్ట్రక్షన్ ఈ పనులు నిర్వహిస్తోంది. అయితే రూ.3.53 కోట్ల పెండింగ్ బిల్లులు ఉండడంతో కాంట్రాక్టర్ ఫినిషింగ్ పనులను నిలిపివేయడంతో ప్రాజెక్టు నిలిచిపోయింది.
మంత్రి హామీతో పనుల్లో కదలిక..
ఇటీవల రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హనుమకొండకు వచ్చిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ప్రాజెక్టు స్థితిని పరిశీలించారు. పెండింగ్ బిల్లులను త్వరగా చెల్లించి, మిగిలిన పనులను రెండు నుంచి మూడు నెలల్లో పూర్తి చేసి భవనాన్ని వినియోగంలోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. పనులు పునఃప్రారంభమైతే, గరిష్టంగా రెండు నెలల్లో ఫినిషింగ్ పూర్తి చేసి, త్వరలోనే కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించే అవకాశం ఉంది.
