పర్వతగిరి/ కాశీబుగ్గ/ నెక్కొండ/ వరంగల్ సిటీ, వెలుగు: తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు. శనివారం వరంగల్ జిల్లా పర్వతగిరి, నెక్కొండ మండలాల్లోని పలుగ్రామాల్లో తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలు, ఇండ్లు, రోడ్లు, లోతట్టు ప్రాంతాలను కలెక్టర్ సత్యశారద పరిశీలించి, చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆఫీసర్లకు రెండు వారాలపాటు హాలీడేస్ లేవని, నిత్యం ఫీల్డ్లో ఉండాలన్నారు.
రైతులు అధైర్యపడొద్దని, నష్టపోయిన పంటల వివరాలు చేకరించి, పరిహారం అందించేలా చూస్తామన్నారు. నెక్కొండ మండలం రెడ్లవాడలో హెల్త్సబ్సెంటర్లో కరెంట్, పరిశుభ్రత లేకపోవడంపై డాక్టర్పై అగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ సిటీలోని పలు కాలనీల్లో పర్యటించి బాధితులతో మాట్లాడారు. హనుమకొండ పరిధిలోని పలు కాలనీల్లో బల్దియా కమిషనర్ చాహత్బాజ్పాయ్ పర్యటించి, వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.
