వరంగల్ సిటీ, వెలుగు: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగిని నిద్ర మాత్రలు మింగి మంగళవారం ఉదయం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేట మండలం దమ్మన్నపేటకు చెందిన శ్రుతి, వరంగల్ బల్దియాలో గత కొన్నేళ్లుగా శానిటేషన్ విభాగంలో జవానుగా పనిచేస్తోంది. ఆరోగ్య సమస్యల వల్ల ప్రస్తుతం కార్పొరేషన్ ఇన్వార్డ్ సెక్షన్లో విధులు నిర్వహిస్తోంది.
కొంతకాలంగా అదే విభాగంలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగినితో పాటు ఆఫీస్ సూపరింటెండెంట్ ఆనంద్ తనను వేధిస్తున్నారని ఆమె ఆరోపించింది. సోమవారం ఆఫీస్కు పిలిచి దుర్భాషలాడారని వాపోయింది. వారి వేధింపులు భరించలేక మంగళవారం నర్సంపేటలో నిద్ర మాత్రలు మింగినట్లు శ్రుతి తెలిసింది. ప్రస్తుతం ఆమె నర్సంపేటలో చికిత్స పొందుతోంది. బాధితురాలి ఆరోపణలపై సూపరింటెండెంట్ ఆనంద్ స్పందించారు. సెక్షన్లో ఫైళ్లు ఎక్కువగా పేరుకుపోవడంతో పని వేగంగా పూర్తి చేయాలని చెప్పానని, వేధింపులకు గురిచేయలేదని తెలిపారు.
