నీళ్లను వేస్ట్ చేస్తే యాక్షన్ తీసుకోండి.. ఇండ్లు, వాహనాలు కడిగితే ఊరుకోవద్దు

నీళ్లను వేస్ట్ చేస్తే యాక్షన్ తీసుకోండి..  ఇండ్లు, వాహనాలు కడిగితే ఊరుకోవద్దు
  • సమీక్ష సమావేశంలో వాటర్​బోర్డు ఎండీ అశోక్ రెడ్డి
  • 100 రోజుల్లో 15 వేల ఇంకుడు గుంతలకు ప్లాన్

హైదరాబాద్​సిటీ, వెలుగు: నీళ్లను ఇండ్లు, వాహనాలు కడుక్కోవడానికి, ఇతర అవసరాలకు వాడితే సీరియస్​యాక్షన్​తీసుకోవాలని వాటర్ బోర్డు ఎండీ అశోక్​రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఈడీ మయాంక్ మిట్టల్​తో కలిసి వేసవి కార్యాచరణ ప్రణాళిక, తాగునీటి సరఫరా, ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించారు. అశోక్​రెడ్డి మాట్లాడుతూ మోటార్లతో నీటిని తోడుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. 100 రోజుల్లో  బోర్డు పరిధిలో 15 వేల ఇంకుడు గుంతలు నిర్మించేలా ప్లాన్​ చేయాలన్నారు. వేసవిలో నీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్లాన్లు రూపొందించుకోవాలన్నారు. 

ఇప్పటికే 1150 ట్యాంకర్లు, 90 ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్లు, 150 ఫిల్లింగ్ పాయింట్స్ ఉండగా.. డిమాండ్ ని బట్టి అదనపు ఫిల్లింగ్ స్టేషన్ కోసం ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. ఇప్పటీవరకు బకాయి ఉన్న వాణిజ్య కనెక్షన్లను గుర్తించి వసూళ్లు చేయాలన్నారు. రూ.వెయ్యి ఆపైన నీటిని వాడే వినియోగదారులను గుర్తించి వంద శాతం బిల్లును అందించి, వసూలు చేయాలన్నారు. ప్రతినెలా సరాసరి రెవెన్యూతో పాటు అదనంగా ప్రతి మేనేజర్ వారి సెక్షన్ పరిధిలో టాప్ 50 వినియోగదారుల బకాయిల బిల్లుల వసూలును లక్ష్యంగా నిర్దేశించారు.