తెలంగాణలో సాగునీటి సంగతేమోగానీ రాబోయే తాగునీటి గండం నుంచి ఎలా గట్టెక్కాలో తెలియక సర్కారు తలపట్టుకుంటున్నది. ముఖ్యంగా ఎల్లంపల్లి నీటిమట్టం తగ్గడంతో హైదరాబాద్ మెట్రో వాటర్స్కీంకు తిప్పలు తప్పేలా లేవు. ఈ ప్రాజెక్టులో గత మార్చి7న 17.51 టీఎంసీల నీరుండగా, తాజాగా 10 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్కు 320 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు తరలిస్తున్నారు.
కృష్ణా బెల్ట్లో ఈ వానకాలం తీవ్ర వర్షాభావ పరిస్థితులు తలెత్తాయి. దీంతో జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు డెడ్స్టోరేజీకి చేరాయి. ప్రస్తుతం జూరాలలో 4 టీఎంసీలు, శ్రీశైలంలో 36.40 టీఎంసీలు, సాగర్లో 140 టీఎంసీలు మాత్రమే నీళ్లున్నాయి. నాగార్జున సాగర్ డెడ్స్టోరేజీ 510 అడుగులు కాగా, ప్రస్తుతం 515 అడుగుల నీరు మాత్రమే ఉన్నది. తాగునీటి అవసరాల దృష్ట్యా ఖరీఫ్ నుంచే సాగర్ ఆయకట్టు కింద రాష్ట్ర సర్కారు క్రాఫ్ హాలీడే ప్రకటించింది. కానీ సాగర్ఆయకట్టు కింద బోర్లపై ఆధారపడి పంటలు సాగుచేసిన రైతులు భూగర్భజలాలు అడుగంటడంతో చాలాచోట్ల పశువుల మేతగా వదిలేస్తున్నారు.
అటు గోదావరి ప్రాజెక్టుల పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 26 టీఎంసీలు, ఎల్లంపల్లిలో 10 టీఎంసీలు, మిడ్మానేరులో 12, ఎల్ఎండీలో కేవలం7 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. వేసవి తాగునీటి అవసరాల దృష్ట్యా ఆయా ప్రాజెక్టుల కింద సాగునీటి సరఫరాకు సర్కారు కోతలుపెడ్తున్నది. ఉదాహరణకు కరీంనగర్ సమీపంలోని ఎల్ఎండీ నుంచే కరీంనగర్, మానకొండూర్, హుస్నాబాద్, హుజూరాబాద్, సిద్దిపేట నియోజకవర్గాలకు మిషన్భగీరథ కింద తాగునీరు అందించాల్సి ఉండగా, కాకతీయ కాలువకు సాగునీటి సరఫరా తగ్గించింది. దీంతో చివరి ఆయకట్టుకు నీళ్లందక హనుమకొండ జిల్లాలోని రైతులు రోడ్డెక్కుతున్నారు.