
వర్ని, వెలుగు : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క చెప్పారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా మోస్రా, చందూరు మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్లు ఏర్పాటు, ఆర్టీసీ బస్సుల కొనుగోలు కోసం లోన్లు ఇస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్రెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, రాష్ట్ర ఆగ్రో చైర్మన్ కాసుల బాల్రాజు, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సబ్ కలెక్టర్ వికాస్ మహత౪, వర్ని ఏఎంసీ చైర్మన్ సురేశ్ బాబా, వైస్ చైర్మన్ లక్ష్మణ్, నాయకులు పోచారం సురేందర్రెడ్డి, భాస్కర్రెడ్డి, హరినారాయణ పాల్గొన్నారు.
శ్రీనివాస్రెడ్డి, రవీందర్రెడ్డి వర్గీయుల బాహాబాహీ
మంత్రి పర్యటన టైంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు రవీందర్రెడ్డి వర్గీయులు బాహాబాహీకి దిగారు. మోస్రాలో ఫంక్షన్ హాల్, చందూరులో జీపీ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఏనుగు రవీందర్రెడ్డిని పోచారం వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే ఉన్న రవీందర్ రెడ్డి వర్గీయులు నినాదాలు చేస్తూ ముందుకు దూసుకెళ్లారు.
గమనించిన పోలీసులు ఇరు వర్గాలను సముదాయించి రవీందర్రెడ్డిని లోపలికి పంపించారు. తర్వాత ఇరువర్గాల నాయకులు పోటాపోటీగా నినాదాలు చేసుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకొని నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది.