అప్పులున్నా అభివృద్ధి చేస్తున్నం.. పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్నం: మంత్రి వివేక్ వెంకటస్వామి

అప్పులున్నా అభివృద్ధి చేస్తున్నం.. పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్నం: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • కాంగ్రెస్​ ప్రభుత్వంలో పేదల కష్టాలు ఒక్కొక్కటి తీరుతున్నయ్
  • ఇన్​చార్జి మంత్రిగా ఉమ్మడి మెదక్​ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ
  • సిద్దిపేట జిల్లాలో పర్యటన
  • ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేత 


.సిద్దిపేట/గజ్వేల్/దుబ్బాక, వెలుగు: కాంగ్రెస్ పాలనలో పేదల కష్టాలు ఒక్కొక్కటిగా తీరుతున్నాయని కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్​ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రం 8 లక్షల కోట్ల అప్పులతో ఆర్థికంగా కష్టాల్లో ఉన్నా.. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఉమ్మడి మెదక్​ జిల్లా ఇన్​చార్జి మంత్రిగా జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. 

శుక్రవారం గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాకలో ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. 50 ఏండ్ల కిందటే ఇందిరా గాంధీ గరీబీ హటావో అని పిలుపునిచ్చారని, అప్పటి నుంచే పేదరిక నిర్మూలన పథకాలను కాంగ్రెస్ అమలు చేస్తోందని గుర్తు చేశారు. వైఎస్సార్ హయాంలో ఇందిరమ్మ పేర పేదలకు ఇండ్లు పంపిణీ చేశారన్నారు. 

లబ్ధిదారులే ఇండ్లు కట్టుకోవడానికి వీలుగా రూ.5 లక్షలు ఇస్తున్నామని, దళితులకు మరో లక్ష అదనంగా ఇస్తున్నామని తెలిపారు. సిద్దిపేట జిల్లాకు 12 వేల ఇండ్లు మంజూరయ్యాయని, అందులో సిద్దిపేట నియోజకవర్గానికి మూడు వేల ఇండ్లు మంజూరు చేసినట్టు ప్రకటించారు. ఇండ్లకు అవసరమైన ఇసుక ఉచితంగా అందిస్తున్నట్టు చెప్పారు. ఇండ్లు రానివాళ్లు బాధపడవద్దని, ప్రతి నియోజకవర్గానికి ప్రతి ఏటా 3,500 ఇండ్లు ఇస్తామన్నారు. అవసరమైతే జిల్లాకు అదనంగా ఇండ్లు మంజూరు చేయాలని సీఎంను కోరతానని హామీ ఇచ్చారు. 

ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్​ రాని వాళ్లు మళ్లీ అప్లికేషన్​ పెట్టుకోవాలని మంత్రి సూచించారు. సీఎం రేవంత్​ కృషివల్ల రాష్ట్రానికి రూ.1 .70 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయని, తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ హైమావతి, అడిషనల్​ కలెక్టర్ గరిమా అగర్వాల్, సిద్దిపేట మున్సిపల్ చైర్ పర్సన్ కడవేర్గు మంజులా రాజనర్సు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాకలో ఇందిరమ్మ ఇంటి నమూనాలను ప్రదర్శించారు.  

మూడు స్థానాల్లో కాంగ్రెస్  జెండా ఎగరాలి

 సిద్దిపేట జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరేలా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని జిల్లా ఇన్​చార్జి మంత్రి వివేక్ వెంకట స్వామి సూచించారు. శుక్రవారం దుబ్బాక పార్టీ ఆఫీసులో నిర్వహించిన కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. దుబ్బాక నియోజకవర్గ సమస్యలను ప్రాధాన్యతాక్రమంలో పరిష్కారానికి  కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తేవాలని, అవసరమైతే సీఎంను కలుస్తానని అన్నారు. 

నాయకులు, కార్యకర్తలు విభేదాలు పక్కన పెట్టి జిల్లాలో  కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని సూచించారు. చిన్న సమావేశాలకైనా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లో కార్యకర్తలు  విస్తృతంగా ప్రచారం చేసి.. పథకాలు అందని వారిని కలసి వివరాలు తీసుకుని వారికి అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక కాంగ్రెస్ ఇన్ చార్జీ చెరుకు శ్రీనివాస్​రెడ్డి పాల్గొన్నారు.