
- కేంద్ర కేబినెట్ నిర్ణయం 18.70 లక్షల మంది స్టూడెంట్లకు లబ్ది
- కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వెల్లడి
న్యూఢిల్లీ: ‘పీఎం–శ్రీ స్కూల్’ స్కీం కింద దేశవ్యాప్తంగా 14వేలకు పైగా పాఠశాలలను అప్గ్రేడ్ చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం రూ.27,360 కోట్ల కేటాయింపు నిర్ణయానికి బుధవారం ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ మీడియాకు వెల్లడించారు. విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. పీఎం–శ్రీ స్కూల్ స్కీం కింద దేశవ్యాప్తంగా 18.70 లక్షల మంది స్టూడెంట్లులబ్ది పొందుతారని వివరించారు. కేంద్రీయ, నవోదయ విద్యాలయాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూళ్లను కూడా ఈ స్కీం కింద అప్గ్రేడ్ చేస్తున్నామన్నారు. టీచర్స్ డే రోజు ఈ స్కీంను ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారని గుర్తుచేశారు. ఐదేండ్లకు మొత్తం ప్రాజెక్టు ఖర్చు రూ.27,360 కోట్లు కాగా, ఇందులో కేంద్రం వాటా రూ.18,128 కోట్లు అని తెలిపారు. ఈ స్కీం కింద విద్యార్థులందరికీ సమానంగా మెరుగైన విద్యను అందజేస్తామని తెలిపారు. విద్యార్థుల చదువు సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ స్కీం తీసుకొచ్చామని వివరించారు.
35 ఏండ్ల లీజుకు రైల్వే భూమి
పీఎం గతి శక్తి ప్రోగ్రాంలో భాగంగా రైల్వే భూమిని లీజుకు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. దీంతో 300 కార్గో టెర్మినల్స్ ఏర్పాటవుతాయని, 1.25లక్షల మంది ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు. 35 ఏండ్ల లీజుతో ఎంతో లబ్ది పొందొచ్చన్నారు. కొచ్చి మెట్రో రైల్ ప్రాజెక్ట్ రెండో ఫేజ్కు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 11 స్టేషన్లు, 11 కిలోమీటర్ల మేర చేపట్టే ప్రాజెక్టు కోసం రూ.1,957 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ రోడ్డుతో పాటు మెయిన్ రోడ్డును కూడా విస్తరింపజేస్తున్నారు.