గెలిచేది మేమే..రెండో స్థానం కోసమే వారి పోటీ : మంత్రి జగదీశ్​రెడ్డి

గెలిచేది మేమే..రెండో స్థానం కోసమే వారి పోటీ : మంత్రి జగదీశ్​రెడ్డి
  • నీళ్ల కేటాయింపును కేంద్రం తేల్చలే
  • అందుకే రిజర్వాయర్ల పనులు చేయలే 
  • గెలిచేది మేమే..రెండో స్థానం కోసమే వారి పోటీ 
  • 'వెలుగు'తో మునుగోడు ఎన్నికల ఇన్​చార్జి మంత్రి జగదీశ్​రెడ్డి

నల్గొండ, వెలుగు : మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్​ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని, ఫ్లోరైడ్​ పీడ వదిలిస్తామని టీఆర్ఎస్​ఎన్నికల ఇన్ చార్జి, విద్యుత్​శాఖ మంత్రి జి.జగదీశ్​రెడ్డి అన్నారు. మంగళవారం ‘వీ6 వెలుగు’తో ఆయన మాట్లాడారు. 2014 నుంచి 2018 వరకు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, మూడేండ్లలో ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి పట్టించుకోకపోవడంతోనే ప్రాజెక్టులు, రోడ్లు పనులు ఆగిపోయాయని చెప్పారు. ఏపీ, తెలంగాణ మధ్య నీళ్ల కేటాయింపును కేంద్రం ఎటూ తేల్చకపోవడంతో రిజర్వాయర్ల పనులు చేయలేకపోయామన్నారు. కానీ, ఎట్టి పరిస్థితుల్లో నీటి కేటాయింపులు సాధించి తీరుతామన్నారు. పెండింగ్​ ప్రాజెక్టులను కంప్లీట్​ చేస్తామని, ఫ్లోరైడ్​ పీడను పూర్తిగా వదిలిస్తామన్నారు. 

రెండో స్థానం కోసమే వాళ్ల పోటీ  

ఉప ఎన్నిక ప్రారంభమైన మొదట్లో తమ ప్రత్యర్థి కాంగ్రెస్​ అనుకున్నామని, కానీ కాంగ్రెస్​ క్యాడర్​ను మభ్య పెట్టి బీజేపీ లాక్కుందని మంత్రి అన్నారు. ఇప్పుడు ఆ రెండు పార్టీలు సమానంగా ఉన్నాయని, రెండో స్థానం కోసమే వాటి మధ్య పోటీ జరుగుతోందన్నారు. ఐటీ దాడులు, ఎన్నికల కమిషన్​చర్యలు వంటివన్నీ ముందుగానే ఊహించినవేనన్నారు. రాజ్యాంగబద్దమైన సంస్థలన్నింటినీ బీజేపీ దుర్వినియోగం చేస్తోందని, డబ్బులు ఎర వేసి ఎన్నికల్లో గెలుద్దామని రాజగోపాల్ రెడ్డి చూస్తున్నాడన్నారు.  

గెలిచిన15 రోజుల్లో రెవెన్యూ డివిజన్​

సర్వేలు ఎవరికి వాళ్లే చేయించుకుంటున్నారని జగదీశ్​రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, గత ప్రభుత్వాలు చేయని అనేక స్కీంలు అమలు చేస్తున్నామన్నారు. ఫ్లోరైడ్​ ప్రాంతంలో భూగర్భ జలాలు పెంచేందుకు చెక్​ డ్యాంలు నిర్మించామన్నారు. మిషన్ కాకతీయ చెరువుల పూడిక తీయించామన్నారు. ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరువేరుస్తామన్నారు. మునుగోడు అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. చండూరు రెవెన్యూ డివిజన్​ అనేది కొత్తగా వచ్చిన డిమాండ్​ కాబట్టి ఎన్నికల్లో గెలిచిన 15 రోజుల్లో  కంప్లీట్​ చేస్తామన్నారు. వంద పడకల దవాఖానాను కూడా మంజూరు చేయిస్తామన్నారు.