కేబినెట్ భేటీలో ఏపీ సీఎం జగన్ నిర్ణయం
అమరావతి భూముల విచారణ సిట్కు అప్పగించాలని నిర్ణయం
అమరావతి, వెలుగు: వచ్చే ఉగాది పండుగ రోజున రాష్ట్రవ్యాప్తంగా 26 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ఇండ్లు లేని పేదలకు ప్రభుత్వం ఉచితంగా స్థలాలు కేటాయించనుంది. అందుకు 26,976 ఎకరాల ప్రభుత్వ భూమి, 16,164 ఎకరాల ప్రైవేటు భూమి కలిపి మొత్తం 43,140 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. బుధవారం సెక్రటేరియెట్ లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి పేర్ని నాని కేబినెట్ డెసిషన్లను మీడియాకు వెల్లడించారు. ఇండ్ల స్థలాలను లబ్ధిదారుల్లో మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేయించి అందిస్తామన్నారు. రిజిష్ట్రేషన్ చేసి ఇచ్చేందుకు ఎమ్మార్వోలకు జాయింట్ సబ్రిజిస్ట్రార్ హోదా కల్పిస్తున్నామన్నారు. పేదలకు కేటాయించిన ఈ ఇళ్ల స్థలాల్లో ఏటా 6 లక్షల చొప్పున వచ్చే నాలుగేళ్లలో మొత్తం 26 లక్షల ఇళ్లను ప్రభుత్వమే కట్టించి ఇస్తుందని చెప్పారు.
ఏన్పీఆర్ పై అసెంబ్లీలో తీర్మానం చేస్తం
ఎన్పీఆర్ (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్) పై మైనార్టీల్లో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం కొత్తగా తెచ్చిన ఎన్పీఆర్కు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీలో బిల్లు పెడతామని మంత్రి నాని చెప్పారు. 2010 ఎన్పీఆర్లోని ప్రశ్నలనే 2020 ఎన్పీఆర్లో ఉంచాలని కేంద్రానికి ఏపీ తరఫున కోరుతామన్నారు. అమరావతిలో టీడీపీ హయాంలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్, భూముల అమ్మకాలు, కొనుగోళ్లపై కేబినేట్ సబ్ కమిటీ రిపోర్ట్లోని అంశాలపై విచారణ, దర్యాప్తు చేసే అధికారాన్ని సిట్కు అప్పగిస్తామన్నారు. రాష్ట్రంలో కొత్తగా రామాయపట్నం పోర్టు ఏర్పాటు, భావనపాడు, మచిలీపట్నంలలో పోర్టుల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేస్తామన్నారు.