- ఇందిరమ్మ రాజ్యంలో ఇటువంటివి సహించం
- డిప్యూటీ సీఎం భట్టితో మాట్లాడిన సీఎం రేవంత్
హైదరాబాద్, వెలుగు: ఒక చోరీ కేసులో దళిత మహిళను షాద్ నగర్ పోలీసులు పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి శిక్షించిన అంశంపై అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మంగళవారం ఈ అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మాట్లాడారు. కేసు పూర్వాపరాలు తెలుసుకుని బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టికి సీఎం రేవంత్ ఆదేశాలిచ్చారు.
సీఎం చెప్పిన వెంటనే స్పందించిన భట్టి సంబంధిత పోలీస్ సిబ్బంది, అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులకు ఆర్డర్స్ ఇచ్చారు. దీంతో కమిషనర్ అవినాశ్ మహంతి ఒక సీఐ సహా ఆరుగురు సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వంలో షాద్ నగర్ వంటి సంఘటనలను సహించేది లేదని డిప్యూటీ సీఎం తెలిపారు.
ఈ ఘటనలో బాధిత కుటుంబానికి వైద్య సహాయం అందించడంతో పాటు సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వ పరంగా అన్ని విధాల అండగా ఉంటామని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని పోలీసు ఉన్నత అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు.
