
- కార్యకర్తల్లో ఉత్సాహం ఉంది.. 42% బీసీ రిజర్వేషన్లకు మా మద్దతు
- ఎన్నికల షెడ్యూల్ నిలబడుతుందని నమ్ముతున్న: బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు
హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని స్థానాలకు సింగిల్ గా పోటీ చేసి ఎక్కువ సీట్లను బీజేపీ గెలువబోతోందని ఆ పార్టీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎన్నికల షెడ్యూల్ ను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. స్థానిక ఎన్నికలు జరిగితేనే కేంద్రం నుంచి నిధులు వస్తాయని అన్నారు. ఇప్పటికే గ్రామాల్లో పాలన కుంటు పడిందని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు తాము మద్దతిస్తున్నట్టు చెప్పారు. ఈ జీవో గతంలోనే ఇచ్చి ఉంటే సమస్య వచ్చేది కాదన్నారు. ఎన్నికల షెడ్యూల్ నిలబడుతుందని తాను నమ్ముతున్నట్టు చెప్పారు.
కాంగ్రెస్ నాయకులు ప్రెసిడెంట్, గవర్నర్, బీజేపీ అడ్డుకుంటుంది అని, కిషన్ రెడ్డి బండి సంజయ్ అడ్డుకుంటున్నారని డ్రామాలు ఆడారని చెప్పారు. ఇన్ని రోజులూ ఎన్నికలు నిర్వహించకుండా సాకులతో ప్రభుత్వం ఇన్నాళ్ళు కాలయాపన చేసిందని అన్నారు. రాష్ట్ర ప్రజలు బీజేపీతోనే ఉన్నారని అన్నారు.
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలన చూశారని, ఇప్పుడు బీజేపీకి అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. స్థానిక ఎన్నికల్లో అత్యధికంగా స్థానాలు గెలవబోతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందని, కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో సింగిల్ గానే పోటీ చేసి విజయం సాధిస్తామని, ఎవరితోనూ పొత్తు ఉండబోదని రాంచందర్ రావు చెప్పారు.