
- ఎస్వీబీసీ హిందీ ఛానెల్కు సహకరిస్తాం
- టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి మహారాష్ట్ర సి ఎం ఉద్ధవ్ ఠాక్రే హామీ
తిరుపతి: ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి కేటాయిస్తామని, అలాగే ఎస్వీబీసీ హిందీ ఛానల్కు కూడా సహకరిస్తామని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి హామీ ఇచ్చారు. ముంబైలో మంగళవారం రాత్రి అదనపు ఈవో ధర్మారెడ్డి, ఎస్వీబీసీ సిఈవో సురేష్ కుమార్ లతో కలసి సుబ్బారెడ్డి సీఎం ఉద్దవ్ ఠాక్రేను కలిశారు. ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి సంబంధించి సహకారం అందించాలని ఆయన కోరారు. గత ప్రభుత్వం కేటాయించిన భూమి పరిశీలించాలని, అది అనువుగా లేదనుకుంటే ఇంకో చోట భూమి కేటాయిస్తామని ఠాక్రే చెప్పారు. ఎస్వీబీసీ హింది ఛానల్ ను ఉగాదికి ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చైర్మన్ వివరించారు. హిందూ ధర్మ ప్రచారం కోసం ఛానెల్ కు కూడా ప్రభుత్వ సహకారం అందించాలని చైర్మన్ విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని సీఎం ఉద్దవ్ ఠాక్రే చెప్పారు. టీటీడీ చేపట్టిన ధార్మిక కార్యక్రమాల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ సుబ్బారెడ్డి సీఎం కు శ్రీవారి వారి ప్రసాదాలు అందించి శేష వస్త్రంతో సన్మానించారు.
అన్ని విధాలా సహకరిస్తాం-ముంబై సలహామండలి హామీ
ముంబైలో శ్రీవారి ఆలయం, ఎస్వీబీసీ హింది ఛానల్ ఏర్పాటుకు అన్ని విధాలా సహకరిస్తామని స్థానిక సలహా మండలి సభ్యులు హామీ ఇచ్చారు. మంగళవారం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, ఎస్వీబీసీ సిఈవో సురేష్ కుమార్ సలహామండలి సభ్యులతో సమావేశమయ్యారు. ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ముంబైలో శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.
ఇవి కూడా చదవండి
ఒక్క ఓటు తేడాతో సర్పంచ్ గా గెలిచాడు
అచ్చెన్నాయుడు స్వగ్రామంలో టీడీపీ అభ్యర్థి గెలుపు
షర్మిల..జగన్ అన్న వదిలిన బాణం కాదు,కేసీఆర్ వదిలిన బాణం