- బీఆర్ఎస్ పాలనలో సింగరేణికి 40 వేల కోట్ల బకాయిలు: మంత్రి శ్రీధర్బాబు
- వారి పాలనలో అన్ని అక్రమాలే
- ఉక్కుసంకల్పంతో పని చేస్తామని చెప్పడానికే సీఎం రేవంత్ హిట్లర్ అనే పదాన్ని వాడారు
- కబ్జాదారుల భరతం పడుతుంటే కొందరు ఓర్వలేక దొంగ ఏడుపులని విమర్శ
హైదరాబాద్, వెలుగు: సింగరేణి బొగ్గు నిల్వల అంశంతో పాటు 2014 నుంచి సింగరేణిలో జరిగిన అన్ని రకాల అక్రమాలపై ఎంక్వైరీ చేయిస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో సింగరేణి బొగ్గు నిల్వలకు సంబంధించి ఏం జరిగిందో బయటకు రావాలన్నారు. సీఎల్పీ ఆఫీసులో శ్రీధర్బాబు సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
బొగ్గు గనుల వేలంలో సింగరేణిని పాల్గొనకుండా అడ్డంకులు సృష్టించారని, బీఆర్ఎస్ కు అనుకూలమైన సంస్థలకే బొగ్గు గనులను కేటాయించారని శ్రీధర్బాబు ఆరోపించారు. కోయగూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్ 3 గనులు దక్కకపోవడంతో సింగరేణి రూ.2 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందన్నారు. బీఆర్ఎస్ తమ హయాంలో సింగరేణికి బొగ్గు, విద్యుత్కు సంబంధించి రూ.40 వేల కోట్లు బకాయి పడిందన్నారు.
సింగరేణి కార్మికులకు కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో సింగరేణిలో అనేక అక్రమాలు జరిగాయని, 2014 లోకార్మిక వ్యతిరేక, ప్రభుత్వరంగ సంస్థలకు వ్యతిరేకంగా కేంద్రం తెచ్చిన ఎంఎండీఆర్ చట్టానికి అప్పటి టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవిత, బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. అందుకే 2023 గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం పోటీ చేయలేదన్నారు.
సంస్థలో రాజకీయ జోక్యం పెరిగిపోయిందని, బీఆర్ఎస్లీడర్లకే ఓబీ టెండర్లు ఇచ్చారని ఆరోపించారు. తమ ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులను గుర్తించి వారికి లాభాల్లో వాటా ఇచ్చిందన్నారు. సింగరేణి కార్మికులకు రూ.కోటి, కాంట్రాక్ట్ కార్మికులకు రూ.40 లక్షల ప్రమాద బీమా కల్పించామన్నారు. బీఆర్ఎస్ నిజాలు దాచిపెట్టి సింగరేణిపై గోబెల్స్ ప్రచారం చేస్తుందన్నారు. తప్పుడు ప్రచారం మానకుంటే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా కూడా రాదన్నారు. సంస్థ గురించి పూర్తిగా స్టడీ చేసి మాట్లాడాలని, అసత్యాలు మాట్లాడవద్దని ఆయన హరీశ్రావుకు సూచించారు.
సీఎం చెప్పిన ఉద్దేశం వేరు
క్రమశిక్షణతో, ఉక్కుసంకల్పంతో పని చేస్తున్నామన్న భావనతో సీఎం రేవంత్రెడ్డి హిట్లర్ అనే పదాన్ని వాడారని, దాన్ని నాజీ హిట్లర్ తో పోల్చడం సరికాదని మంత్రి శ్రీధరబాబు అన్నారు. హిట్లర్ సిద్ధాంతాలను పాటిస్తామని సీఎం చెప్పలేదని, చెరువులను కబ్జాదారుల నుంచి కాపాడడంతో తమ దృఢ వైఖరిని చెప్పేందుకే హిట్లర్ అనే పదం రేవంత్ వాడారన్నారు. కబ్జాదారుల గుండెల్లో భయం పుట్టిస్తుంటే ఓర్వలేక కొందరు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారన్నారు.
కేసీఆర్, కేటీఆర్ ప్రజాస్వామిక విలువల గురించి మాట్లాడటమంటే గురువింద గింజ నలుపు ఎరుగనట్లేనన్నారు. కేటీఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడడం శతాబ్దపు జోక్ అని, పదేండ్ల పాటు కేసీఆర్ సెక్రటేరియెట్ కు రాలేదని, ప్రగతి భవన్ కు ఎవరిని రానివ్వలేదని, హిట్లర్ బంకర్ లా ప్రగతి భవన్ కంచెలు ఉంటే వాటిని తామే తొలగించామన్నారు. హైడ్రా చట్ట పరిధిలో పనిచేస్తోందని స్పష్టం చేశారు.
ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి రక్షిస్తే బీఆర్ఎస్ నాయకులు ఎందుకు బాధపడుతున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా చేయాలన్న రేవంత్రెడ్డి ప్రయత్నాలను నగర ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. తమ డీఎన్ఏలో హింస లేదని, తమలాగే అందరూ తాలిబాన్ లలా పనిచేస్తారని బీఆర్ఎస్ అనుకుంటుందన్నారు.
గతంలో కేసీఆర్ తాను హిట్లరే అని వ్యాఖ్యానించారు. ఆ మాటలు అన్న కేసీఆర్ హిట్లర్ సిద్ధాంతాన్ని అమలు పర్చారా? అని ప్రశ్నించారు. తలకిందులుగా తపస్సు చేసినా బీఆర్ఎస్కు వంద సీట్లు కాదు కాదా, పది సీట్లు కూడా రావని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ బెదిరింపులకు అధికారులు భయపడొద్దని, చట్టాలకు అనుగుణంగా పనిచేసే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
