నిజామాబాద్ ఎంపీ సీటు గెలుస్తాం : సుదర్శన్ రెడ్డి

నిజామాబాద్ ఎంపీ సీటు గెలుస్తాం : సుదర్శన్ రెడ్డి
  •     లక్ష 30 వేల ఓట్లతో కాంగ్రెస్​ గెలుస్తుంది 
  •     బీజేపీ, బీఆర్​ఎస్ కుమ్మక్కైనా ప్రజల ఆదరణ మాకే
  •     పార్లమెంట్​ ఎన్నికల సమన్వయకర్త ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి 

నిజామాబాద్​, వెలుగు : నిజామాబాద్​ పార్లమెంట్​ స్థానాన్ని లక్షా  30  వేల ఓట్ల మెజార్టీతో పక్కాగా గెలవబోతున్నామని నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల కో ఆర్డినేటర్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.  పోలింగ్​ జరిగిన తీరు ఇతర అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఈ అంచనాకు వచ్చామన్నారు. మంగళవారం ఆయన నగరంలో మీడియాతో మాట్లాడారు.  ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్​ కుమ్మక్కు రాజకీయాలు చేసినా ప్రజలు కాంగ్రెస్​ను ఆదరించారన్నారు.  సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉంటూ మచ్చలేని నేతగా పేరొందిన జీవన్​రెడ్డి అభ్యర్ధి కావడం ప్లస్​ పాయింట్​ అయిందన్నారు.

ఎన్నికల్లో తమకు సహకారం అందించిన వామపక్ష పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు.  ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్ మాట్లాడుతూ..  కార్యకర్తలు తామే అభ్యర్థులుగా భావించి జీవన్​రెడ్డి గెలుపు కోసం కష్టపడ్డారని వారి శ్రమకు ఫలితం లభించిందన్నారు.  మతసామరస్యాన్ని చాటిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.  ఉత్తర భారత్​లో బీజేపీ ఉనికి కోల్పోయిందని డబుల్​ఇంజిన్​ సర్కార్​ వారికి సాధ్యం కాదన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్​రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, డి.రాజేశ్వర్​, అరికెల నర్సారెడ్డి, ముత్యాల సునీల్​రెడ్డి తదితరులు ఉన్నారు.