హైదరాబాద్ : రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఇవాళ, రేపు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనుండగా.. మరికొన్ని చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. హైదరాబాద్ లో గురువారం 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీ రాంపూర్ లో 42.5 డిగ్రీలు, ఆసిఫాబాద్ జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ.
ఏపీలో 24గంటల్లో అల్పపీడనం
దక్షిణ అండమాన్ పరిసరాల్లో రాగల 24గంటల్లో అల్పపీడని ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడి, 48గంటల్లో అది మరింత బలపడి, వాయుగుండంగా మారే సూచనలున్నాయని చెప్పింది. దీంతో రానున్న 49గంటల్లో ఏపీలో 30-40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచి, ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలో 41-43డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు.