
కరీంనగర్/సిద్దిపేట, వెలుగు:పెడ్లంటే జీవితంలో మనిషి తనకు తెలిసి చేసుకునే అతి పెద్ద వేడుక. దీని కోసం ఎన్నో కలలు కంటారు. ఎంతో వైభవంగా చేసుకోవాలని ప్లాన్లు వేస్తారు. ఆకాశమంత పందిరి.. భూదేవంత పీటలు వేసి అందరిని పిలుచుకుని దర్జాగా చేసుకోవాలని అనుకుంటారు. కానీ ఇప్పుడు పెడ్లంటే తాళాలు.. తప్పెట్లు.. బాజాలు.. భజంత్రీలు.. మూడే ముళ్లు.. ఏడు అడుగులు అన్నట్లుగా మారింది. కరోనాకు ముందు ఊహించని స్థాయిలో పెండ్లిళ్లు వైభవంగా జరిగాయి. కానీ కరోనా పుణ్యమాని.. కేవలం 10 నుంచి 20 మందితోనే మమ అనిపిస్తున్నారు. కేవలం మంత్రాలు చదివేందుకు పురోహితులు.. అక్షింతలు వేసేందుకు అటు 10 ఇటు 10 మంది బంధువులు. అంతే ఓ 30 మందికి చేసిన వంట.. వెంటనే తినేసి ఎక్కడివారు అక్కడే గప్ చుప్ అన్నట్లుగా వెళ్లిపోతున్నారు. గ్రాండ్ గా ఫంక్షన్స్ చేసుకోవాలనుకునే వారు పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. పేద, మధ్య తరగతివారు ఖర్చు తగ్గుతుందని ఇప్పుడే మొగ్గు చూపడం విశేషం.
ఈ ఏడాది వేసవి సీజన్లోని మూడు నెలలు పెండ్లిళ్లకు మంచి ముహూర్తాలు ఉండటంతో పలువురు డేట్లు ఫిక్స్ చేసుకున్నారు. ఎంతో వైభవంగా పెండ్లి చేసుకోవాలనుకున్న వారి ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. దీంతో వధువు వరుడి కుటుంబీకులు, కొద్దిమంది బంధువుల సమక్షంలో గత పది రోజులుగా వివాహాలు జరుగుతున్నాయి. మొదట వివాహాలకు అనుమతి ఎవరు ఇవ్వాలనే విషయంపై కొంత సందిగ్థత ఏర్పడినా చివరకు జిల్లా కలెక్టర్ సూచనల మేరకు తహసీల్దార్లు అనుమతి ఇస్తుండగా, వాహనాలకు సంబంధించి పోలీసులు అనుమతి పత్రాలు జారీ చేస్తున్నారు. దీంతో కొద్దిమంది సమక్షంలో ఇండ్ల వద్దనే వివాహాలు జరుపుకొంటున్నారు. మే తరువాత మంచి ముహూర్తాలు లేకపోవడంతో ఆలస్యం చేయకుండా కొద్దిమందితోనే వివాహాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వం అనుమతించిన నాటి నుంచి ఇప్పటి వరకు సిద్దిపేట జిల్లాలో వందకు పైగా పెండ్లిళ్లు హంగు ఆర్భాటాలకు దూరంగా కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో జరిగాయి. టెక్నాలజీ పుణ్యమా అని ఆన్ లైన్లో బంధువులు పెండ్లిని చూస్తూ ఆశీర్వచనాలు అందిస్తున్నారు.
అంతరాలు మాయం
కరోనా దెబ్బకు పెండ్లి అంటే మూడే ముళ్లు.. ఏడే అడుగులు మొత్తం కలిపి నూరేళ్లు అనే చందంగా మారింది. పేద ధనిక భేదం లేకుండా కేవలం వధూవరులు… వారి తరఫున 20 నుంచి 30 మంది బంధువులు మాత్రమే ఉంటున్నారు. కనీసం పెండ్లి కార్డులు సైతం ముద్రించడం లేదు. వచ్చే పది మందికి కార్డులు ఎందుకు దండగ అనుకుంటున్నారు. గతంలో కార్డులు సెలక్షన్ చేయడమే ఓ పెద్ద ప్రాసెస్ గా ఉండేది. వచ్చేవారంతా చాలా దగ్గరివారే కావడంతో ఫోన్లు చేస్తున్నారు. వీడియోలు సైతం లేవు. కేవలం ఫోటోలు తీసుకుంటున్నారు. ఇక పెండ్లి తరవాత చేసే డీజేలు.. బారాత్ బంద్ అయ్యాయి. చుట్టాల సందడి ఇంట్లో లేనే లేదు. వచ్చినవారికి తక్కువ ఖర్చుతో భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒకప్పుడు ఎంత సాధారణంగా చేసినా పెండ్లికి సుమారు మూడు నుంచి నాలుగు లక్షలు ఖర్చయ్యేది. నేడు అంతా రూ. 10 వేల నుంచి 30 వేల ఖర్చుతో పూర్తవుతోంది. లాక్ డౌన్ తో ఆడంబరాలు తగ్గి డబ్బు ఆదా అవుతోంది.
రూ. 30 వేలతోనే…
ఇటీవలే నా వివాహం జరిగింది. ఎంతో వైభవంగా పెండ్లి చేసుకుందామని అనుకున్న. కానీ కరోనా నేపథ్యంలో అది సాధ్యం కాలేదు. ఫంక్షన్ హాల్ లో చేసుకుందామంటే దానికి పర్మిషన్ లేదు. రెండు నుంచి మూడు లక్షలు కావాల్సిన ఖర్చు కాస్త బాగా తగ్గింది. రూ. 30 వేలతోటే నా పెండ్లి జరిగిపోయింది. కరోనా పుణ్యమా అని డబ్బు ఆదా అయింది. కాకపోతే ఆశ పడిన విధంగా పెండ్లి జరగలేదు. ఏదేమైనా మన మంచికే అనుకున్న.
– కూన వెంకటేష్ , గన్నేరువరం, కరీంనగర్
తీవ్రంగా నష్టపోయాం
కరోనా తో ఫంక్షన్ హాల్స్ మూసివేయడం వల్ల తీవ్రంగా నష్టపోయాం. వేసవి సెలవుల్లో పెండ్లిళ్లకు ముహూర్తాలు ఉండటంతో అనేక ఫంక్షన్ హాల్స్ ముందస్తుగా బుకింగ్ అయ్యాయి. లాక్ డౌన్ తో ఆదాయం కోల్పోయాం. మే నెల దాటితే మంచి ముహూర్తాలు లేకపోవడం వల్ల ఫంక్షన్ హాల్స్ ఖాళీగా ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
– దర్పల్లి చంద్రం, సిద్దిపేట ఫంక్షన్ హాల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
గతంలో..
గతంలో పెండ్లిళ్లు జరుపుకోవడానికి ఫంక్షన్ హాల్ కిరాయి 50 వేల నుంచి లక్ష వరకు ఉండేది. భోజనాలకు చికెన్, మటన్ క్వింటాళ్ల కొద్దీ అవసరం పడేది. వీటికి సుమారు లక్ష ఖర్చు అయ్యేది. పెండ్లి పందిరి, రిసెప్షన్ డెకరేషన్ లకు సుమారు 50 వేలు ఖర్చయ్యేది. డీజే సౌండ్ లతో బారాత్ కోసం.. మద్యం తాగి డ్యాన్స్ ల కోసం మరో 50 వేలు ఖర్చు. చుట్టాలను రిసెప్షన్ కు తీసుకు పోవడానికి బస్సుల కిరాయి మరో 20 నుంచి 30 వేలు అయ్యేవి.
ప్రస్తుతం..
పెండ్లి ఫంక్షన్ హాల్ కు ఏ కిరాయి లేదు. భోజనాలు కేవలం 20 నుంచి 30 మందికే చేస్తున్నారు. సాదాగా పెండ్లి పందిరి.. ఇంటి ముందు ఒక్క టెంటు మాత్రమే వేస్తున్నారు. వధూవరులు వెళ్లడానికి ఒక వాహనం సరిపోతుంది. బారాత్ డ్యాన్సులు, మద్యం ఏదీ లేదు. రిసెప్షన్ లేదు కాబట్టి బస్సులలో చుట్టాలను తరలించాలనేది లేదు. అవసరమైన వస్తువులు, బట్టలు మాత్రమే కొంటున్నారు.