
సొంతగడ్డపై టెస్టు సిరీస్లో వెస్టిండీస్ అత్యంత దారుణంగా ఆడి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో విండీస్ క్రికెట్ బోర్డు రంగంలోకి దిగింది. కరీబియన్ క్రికెట్ టీమ్ను మళ్లీ గాడిలో పెట్టేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో విండీస్లో క్రికెట్ భవిష్యత్ను పునరుద్ధరించేందుకు లెజెండరీ ప్లేయర్లు క్లైవ్ లాయిడ్, వివ్ రిచర్డ్స్, బ్రియాన్ లారాతో చర్చలు జరపనుంది. ‘విండీస్ క్రికెట్ను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ ముగ్గురితో చర్చలు జరుపుతాం. ఈ మేరకు ఆహ్వానాలు కూడా పంపాం.
ఇప్పటికే కమిటీలో ఉన్న చందర్పాల్, డెస్మండ్ హేన్స్, ఇయాన్ బ్రాడ్షాతో కలిసి పని చేస్తారు. విండీస్ స్వర్ణయుగానికి వీళ్లందరూ కారకులు. అందుకే మన క్రికెట్ అభివృద్ధి తదుపరి దశను రూపొందించడంలో వాళ్ల ఆలోచనలు కూడా అమూల్యమైనవి. ఈ సమావేశం, స్పష్టమైన ఆచరణీయమైన సిఫారసులకు దారి తీయాలని మేం భావిస్తున్నాం. అందరం కలిసి పని చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఫ్యాన్స్, ప్లేయర్లు, కోచ్లు, లెజెండ్స్, అడ్మినిస్ట్రేటర్లు అడుగు ముందుకేయాల్సిన అవసరం చాలా ఉంది. చాలా పని చేయాల్సి ఉంది. అందరం కలిసి ఓ ఉద్దేశపూర్వకంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి’ అని విండీస్ బోర్డు ప్రెసిడెంట్ కిశోర్ షా వెల్లడించారు. భవిష్యత్లో రాబోయే ఫలవంతమైన ఫలితాల కోసం ప్రతి ఒక్కరూ ఓపిక పట్టాలన్నారు. విండీస్కు బౌలింగ్ గురించి పెద్దగా ఆందోళన లేదన్న షా.. బ్యాటింగ్ చాలా మెరుగుపడాలన్నారు.