- పుజారా, ఉమేశ్పై వేటు
- మహ్మద్ షమీకి రెస్ట్
- రహానెకు టెస్ట్ వైస్ కెప్టెన్సీ
- వన్డేల్లోనూ ముకేశ్కు చోటు
- వెస్టిండీస్ టూర్కు టీమిండియా ఎంపిక
న్యూఢిల్లీ: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో సీనియర్ల వైఫల్యం నేపథ్యంలో వెస్టిండీస్ టూర్కు సెలక్టర్లు కొత్త ముఖాలతో ఇండియా టీమ్ను ప్రకటించారు. డొమెస్టిక్, ఐపీఎల్లో దంచికొడుతున్న యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ను టెస్టు టీమ్లోకి తీసుకున్న సెలక్టర్లు ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడుతున్న సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారాను పక్కనబెట్టి షాకిచ్చారు. శుక్రవారం సమావేశమైన నలుగురు సభ్యుల ఆలిండియా సెలెక్షన్ కమిటీ విండీస్తో రెండు టెస్ట్లకు, మూడు వన్డేలకు వేర్వేరుగా జట్లను ఎంపిక చేసింది. డబ్ల్యూటీసీ కొత్త సైకిల్ (2023–2025) మొదలవుతుండటంతో సెలక్టర్లు ఈసారి యంగ్స్టర్స్కు చాన్స్ ఇచ్చారు. డొమెస్టిక్ క్రికెట్లో సూపర్ పెర్ఫామెన్స్ చేసిన యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ను తొలిసారి టెస్టు టీమ్లోకి తీసుకున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్స్తో రీఎంట్రీ ఇచ్చి మెప్పించిన రహానెకు వైస్ కెప్టెన్సీ కట్టబెట్టారు.
మూడు నెలల నుంచి విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న పేసర్ మహ్మద్ షమీకి విశ్రాంతి ఇచ్చారు. మరో పేసర్ ఉమేశ్ కుమార్ను డ్రాప్ చేసి అతని ప్లేస్లో నిలకడగా రాణిస్తున్న కోల్కతా సీమర్ ముకేశ్ కుమార్కు రెండు ఫార్మాట్లలో చాన్స్ ఇచ్చారు. యశస్వి, రుతురాజ్, ముకేశ్ డబ్ల్యూటీసీ ఫైనల్కు స్టాండ్బైగా ఉన్నారు. కరీబియన్ పిచ్లను దృష్టిలో పెట్టుకుని యంగ్ పేసర్ నవ్దీప్ సైనీని తీసుకున్నారు. వన్డేల కోసం సెలెక్టర్లు17 మందిని ఎంపిక చేసినా ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోలేదు. జులై 12–16, 20–24 మధ్య విండీస్తో రెండు టెస్టులు ఆడనున్న ఇండియా అదే నెల 27,29, ఆగస్టు 1వ తేదీల్లో జరిగే మూడు వన్డేల్లో పోటీ పడుతుంది.
ఓపెనింగ్, మూడో ప్లేస్లో బ్యాటింగ్
యశస్వి, రుతురాజ్ను తీసుకోవడంతో ఇప్పుడు రెండు రకాల లాభాలు కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరూ ఓపెనింగ్తో పాటు మూడో నంబర్లోనూ బ్యాటింగ్ చేయగల సమర్థులు. మధ్యప్రదేశ్తో జరిగిన ఇరానీ కప్లో యశస్వి 213, 144 రన్స్ చేయడం అతనికి కలిసొచ్చింది. ఈ ముంబైకర్ ఫస్ట్ క్లాస్ యావరేజ్ 80.21గా ఉంది. ఫాస్ట్ ట్రాక్లపై అద్భుతంగా బ్యాటింగ్ చేయడం అతనికి ఉన్న మరో స్పెషాలిటీ. రుతురాజ్ కూడా బ్యాటింగ్లో దిట్ట. రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు ఓపెనర్లుగా లేదంటే మూడో ప్లేస్కు బాగా పనికొస్తారని సెలక్టర్లు అంచనా వేస్తున్నారు. ఒకవేళ విరాట్ టెస్టుల నుంచి తప్పుకుంటే కీలకమైన నాలుగో ప్లేస్కు శుభ్మన్ గిల్ రెడీగా ఉన్నాడు. ఓవరాల్గా యంగ్స్టర్స్తో కొత్త టెస్ట్ టీమ్ను బీసీసీఐ రెడీ చేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి..
టెస్ట్ జట్టు: రోహిత్ (కెప్టెన్), గిల్, రుతురాజ్ గైక్వాడ్, కోహ్లీ, యశస్వి, రహానె (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్, ఇషాన్, అశ్విన్, జడేజా, శార్దూల్, అక్షర్, సిరాజ్, ముకేశ్, ఉనాద్కట్, సైనీ.
వన్డే జట్టు: రోహిత్ (కెప్టెన్), గిల్, రుతురాజ్, కోహ్లీ, సూర్య కుమార్, శాంసన్, ఇషాన్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్, జడేజా, అక్షర్, చహల్, కుల్దీప్, ఉనాద్కట్, సిరాజ్, ఉమ్రాన్, ముకేశ్.
పుజారా ఖేల్ ఖతం?
ఇంగ్లండ్ కౌంటీల్లో భారీగా రన్స్ చేసినా, డబ్ల్యూటీసీ ఫైనల్లో ఫెయిలైన పుజారాను ఈసారి కంప్లీట్గా పక్కనబెట్టారు. దీంతో అతని టెస్ట్ కెరీర్ ముగిసినట్లేనని ఊహాగానాలు వస్తున్నాయి. పుజారాపై ఇది వరకే ఓసారి వేటు పడింది. శ్రీలంకతో జరిగిన హోమ్ సిరీస్కు అతనికి టీమ్లో చోటు దక్కలేదు. వెంటనే కౌంటీల్లో ససెక్స్కు ఆడిన పుజారా సెంచరీలతో సత్తా చాటాడు. దీంతో 2022లో ఇంగ్లండ్తో జరిగిన ఏకైక టెస్ట్లో ఆడే చాన్స్ దక్కింది. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో అతను 100 టెస్ట్ల మైలురాయిని అందుకున్నా బ్యాటింగ్లో ఫెయిలయ్యాడు. అయినా డబ్ల్యూటీసీ ఫైనల్స్కు ఎంపిక చేశారు.
కానీ ఓవల్లో జరిగిన ఈ మ్యాచ్లో పుజారా నిరాశపర్చాడు. ఆ మ్యాచ్ చూసేందుకు వెళ్లిన తాత్కాలిక చీఫ్ సెలెక్టర్ శివ్ సుందర్ దాస్.. పుజారా గురించి చీఫ్ కోచ్ ద్రవిడ్తో చర్చించినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్పై చేసిన 90, 102 రన్స్ను కాసేపు పక్కనబెడితే, గత మూడేళ్లలో పుజారా యావరేజ్ 26గా ఉండటంతో వేటు తప్పలేదు. యంగ్స్టర్స్ కుదురుకుంటే పుజారా టెస్ట్ కెరీర్ దాదాపుగా ముగిసినట్లే అనొచ్చు.