
టీమిండియాతో జరుగుతున్న ఢిల్లీ టెస్టులో వెస్టిండీస్ తన పట్టుదలను ప్రదర్శిస్తోంది. రెండో టెస్టులో ఓటమిని తప్పించుకుని డ్రా చేసే ప్రయత్నాలు చేస్తోంది. కాంప్బెల్, హోప్ నాలుగో రోజు తొలి సెషన్ లో భారత బౌలర్లపై ఆధిపత్యం చూపించడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. నాలుగో రోజు లంచ్ సమయానికి ఫాలో ఆన్ ఆడుతున్న వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. వెస్టిండీస్ కేవలం 18 పరుగులు మాత్రమే వెనకబడి ఉంది. చేతిలో 7 వికెట్లు ఉండడంతో టీమిండియాకు ఎంత టార్గెట్ విధిస్తుందో చూడాలి. ప్రస్తుతం క్రీజ్ లో హోప్ (92), కెప్టెన్ ఛేజ్ (23) ఉన్నారు.
రెండు వికెట్ల నష్టానికి 173 పరుగులతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ నాలుగో రోజు కూడా అదే జోరు కొనసాగించింది. కాంప్బెల్, హోప్ జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో సిక్సర్ తో కాంప్బెల్ తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారిన ఈ జోడీని ఎట్టకేలకు జడేజా విడగొట్టాడు. సెంచరీ చేసిన కాంప్బెల్ ను ఎల్బీ డబ్ల్యూ రూపంలో ఔట్ చేశాడు. దీంతో 178 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెర పడింది. వికెట్ పడినా ఆ తర్వాత ఛేజ్ తో హోప్ జట్టును నడిపించాడు. నాలుగో వికెట్ కు అజేయంగా 40 పరుగులు జోడించి లంచ్ వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు.
ఈ సెషన్ లో వెస్టిండీస్ 79 పరుగులు రాబట్టి కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయింది. 140/4 ఓవర్నైట్ స్కోరుతో ఆదివారం మూడో రోజు ఆట కొనసాగించిన విండీస్ తొలి ఇన్నింగ్స్లో 81.5 ఓవర్లలో 248 రన్స్కే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో 248 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్ కావడంతో టీమిండియాకు 270 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో వెస్టిండీస్ ను టీమిండియా ఫాలో ఆన్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన విండీస్ జట్టు ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. టాగెనరైన్ చంద్రపాల్, అలిక్ అథనాజ్ ఔట్ కావడంతో విండీస్ జట్టు 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగింది. ఈ దశలో కాంప్బెల్ (115), హోప్ (92*) జట్టును ఆదుకున్నారు.
ALSO READ : జైశ్వాల్కు కాలికి బంతి విసిరిన విండీస్ పేసర్..
ఇండియా భారీ స్కోర్:
తొలి రోజు ఓవర్ నైట్ స్కోర్ 318/2తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇండియా సెకండ్ డే కూడా పూర్తిగా అధిపత్యం చెలాయించింది. రెండో రోజు మరో 200 పరుగులు చేసి రెండో సెషన్లో 518/5 స్కోరు వద్ద ఫస్ట్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది ఇండియా. ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ (175), కెప్టెన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సాయి సుదర్శన్ (87), కేఎల్ రాహుల్ (38), నితీశ్కుమార్ రెడ్డి (43) రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలలో వారికన్ 3, రోస్టన్ ఛేజ్ ఒక వికెట్ తీశారు.