- మరో ముగ్గురు ప్రత్యర్థి పార్టీల నేతలకూ ఉరి శిక్ష
- టెర్రరిస్టు చర్యలకు పాల్పడినందుకే శిక్షించామని ఆ దేశ ప్రభుత్వ మీడియా వెల్లడి
- గత 50 ఏళ్లలో ఇంతమందిని ఉరితీయడం ఇదే మొదటిసారి
బ్యాంకాక్: మయన్మార్లో నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ(ఎన్ఎల్డీ) మాజీ నేత, సామాజిక కార్యకర్త పయో జియాతో పాటు మరో ముగ్గురు సామాజిక కార్యకర్తలను మయన్మార్ప్రభుత్వం ఉరితీసింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. వారు చట్టవ్యతిరేక కార్యకలాపాలతో పాటు టెర్రరిస్టు చర్యలకు పాల్పడ్డారని, అందుకే వారిని ఉరితీశామని పేర్కొంది. గత 50 ఏళ్లలో ఇంతమంది సామాజిక కార్యకర్తలను ఉరితీయడం ఇదే మొదటిసారి.
ఆంగ్ సాన్సూకీ పార్టీ ఎన్ఎల్డీకి చెందిన పయో జియా వివిధ పేలుడు పదార్థాలను కలిగి ఉన్నారని, అంతేకాకుండా యంగూన్లో ప్రజలను రెచ్చగొట్టి హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని మయన్మార్ మిలిటరీ ప్రభుత్వం పేర్కొంది. హిప్ హాప్ మ్యూజిషియన్ అయిన జియా.. విదేశీ కరెన్సీని కలిగి ఉన్నారన్న ఆరోపణలపై 2008లో జైలుకు వెళ్లారు. ఇక మిలిటరీ ప్రభుత్వం ఉరితీసిన మిగతా వారిలో క్యావ్మిన్యు(53), లా మయో ఆంగ్, ఆంగ్థురా జా ఉన్నారు.
క్యావ్మిన్యు కూడా సామాజిక కార్యకర్త. మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1988లో ‘88 జనరేషన్ స్టూడెంట్స్గ్రూప్’ లేవదీసిన ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. ఆ గ్రూప్లోని ప్రధాన లీడర్లలో ఆయన ఒకరు. వివిధ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు ఆయన 12 ఏళ్లు జైలుశిక్ష అనుభవించారు. మళ్లీ నిరుడు అక్టోబరులో కూడా అరెస్టయ్యారు.
అర్బన్ గెరిల్లా దాడులు నిర్వహించేందుకు మూన్లైట్ ఆపరేషన్ అనే గ్రూప్కు నాయకత్వం వహించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇక మిగిలిన ఇద్దరు లా మయో ఆంగ్, ఆంగ్థురా జా 2021 మార్చిలో ఓ మహిళను మిలిటరీ ఇన్ఫార్మర్గా అనుమానించి చంపేశారు. ఈ కేసులో వారు దోషులుగా తేలారు. అయితే ఆ నలుగురినీ ఎప్పుడు ఉరితీశారో మయన్మార్ మిలిటరీ ప్రభుత్వం వెల్లడించలేదు.