
తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నదని ప్రత్యేక రాష్ట్రం కావాలని 1969లో ఉద్యమం జరిగింది. చాలామంది ఉద్యమకారులు పోలీసు కాల్పులలో చనిపోయినా ప్రత్యేక రాష్ట్రం రాలేదు. చివరకు విద్యార్థుల బలిదానం, ఉద్యోగస్థులు, ప్రజల సహకారం, టీఆర్ఎస్తోపాటు ఆయా పార్టీల ఉద్యమం.. వెరసి జూన్ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన గత 11 ఏండ్లలో తెలంగాణ ప్రజలు సాధించిన ప్రగతి ఏమిటని ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ మూడు విషయాలలో సాధించిన ప్రగతి అంతంత మాత్రమే.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటగా ఆగస్టు 2014లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డి.పి.ఆర్ తయారుచేయడానికి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా వారికి ఇవ్వగా వారు ఒక ఏడాదిలో తగిన సమాచారం సేకరించి తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ రిపోర్టు ప్రకారం జూరాల ప్రాజెక్టు నుంచి 70 టి.యం.సి.ల నీటిని ఎత్తిపోతల ద్వారా తీసుకొని ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు నీరు ఇవ్వొచ్చని, దీనికి అయ్యే ఖర్చు రూ.32,000 కోట్లు అవుతుందని చెప్పారు.
అయితే, అప్పటి సీఎం ఈ డి.పి.ఆర్ను ఒప్పుకోక, నీటిని జూరాల నుంచి కాకుండా శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి తీసుకోవాలని ప్రాజెక్టు సైట్ను జూరాల నుంచి శ్రీశైలంకు మార్చారు. ఈ నిర్ణయం ఎటువంటి సాంకేతిక కారణాలతో కాక, కేవలం ఒక రాజకీయ నాయకుడు తీసుకున్న నిర్ణయం. జీఓ. నం. 105.. తేది 10-–6–-2015 నాడు శ్రీశైలం నుంచి నీటిని 5 పంపుల ద్వారా ఎత్తిపోయాలని పని 3సంవత్సరాల్లో పూర్తి కావాలని, ఇందుకు రూ.35 వేల కోట్లు ఖర్చు అవుతుందని పాలనాపరమైన అనుమతులు ఇచ్చి పనులు మొదలుపెట్టారు.
సరియైన అనుమతులు లేనందున నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు ప్రాజెక్టుకు సరియైన అనుమతులు లేకుండా పనులు నడుస్తున్నాయి అని రూ.920 కోట్ల జరిమానా విధించడం, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసువేసి స్టే తెచ్చుకోవడం జరిగింది. గత పదేండ్లలో ఈ ప్రాజెక్టుపై రూ.30 వేల కోట్లు ఖర్చయినా ఒక్క ఎకరానికి కూడా నీరు అందించలేదు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇంకా రూ.15 వేల కోట్లు అవసరం అని అంచనా. అయినా, పక్క రాష్ట్రం సుప్రీంకోర్టులో వేసిన కేసు తేలాల్సిన అవసరముంది. ఈ ప్రాజెక్టు పనులలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు : లక్ష కోట్ల పైబడి ఖర్ఛయినా కాళేశ్వరం ప్రాజెక్టు ఏ ఫలితం సాధించలేకపోయింది. ఈ ప్రాజెక్టుపై రకరకాల విచారణలు జరుగుతున్నందున దీని గురించి ఇప్పుడు అభిప్రాయం తెలుపుట భావ్యం కాదు. కానీ, ఒక్కటి మాత్రం నిజం. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఖచ్చితంగా చెప్పగలం. ఈ మధ్య కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ఇద్దరు ఇంజినీర్ల వద్ద అవినీతి నిరోధకశాఖ వారు వందల కోట్ల అక్రమాస్తులు కనుగొన్నారు. అంటే, నిర్ణయాలు తీసుకునే రాజకీయ నాయకులు ఇంక ఎంత అవినీతికి పాల్పడ్డారో ఊహించుకోవచ్చు.
ఎస్.ఎల్.బి.సి : గత 20 సంవత్సరాలుగా ఈ టన్నెల్ పనులు సాగుతున్నా ఇప్పటివరకు పనులు పూర్తి కాలేదు. కొన్ని చిన్న ప్రాజెక్టులు చేపట్టి పూర్తి చేసినా తెలంగాణ రాష్ట్రంలో భారీ నీటిపారుదల ప్రాజెక్టు మాత్రం ఒక సమస్యగా తయారై, అనుకున్నవిధంగా నీళ్లు తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి రాలేదు.
నిధులు: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్రం అప్పు రూ.80 వేల కోట్లు ఉండగా అది కాస్తా ఇప్పుడు రూ.7 లక్షల కోట్లకు పెరిగింది. ఇలా అప్పుతెచ్చి చేపట్టిన పనులు ఇంతవరకు ఫలితాలు ఇవ్వడం లేదు. దానితో ఋణభారం పెరిగింది. తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడా అప్పు పుట్టడం లేదు అని స్వయంగా ప్రస్తుత సీఎం చెప్పడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలుపుతోంది. ఇక సంక్షేమ పథకాల పేరుతో పెద్ద ఎత్తున ఖర్చుచేసిన పింఛన్లు, రైతుబంధు వంటివి పక్కన పెడితే మిగిలిన ఖర్చు అంతా దుబారా ఖర్చు.
అప్పుల్లో విద్యుత్ రంగం
రాష్ట్రం ఏర్పడినప్పుడు మనకు కావలసిన విద్యుత్లో సగం మాత్రమే రాష్ట్రంలో ఉత్పత్తి కావడంతో చాలా ఇబ్బందులు ఉండేవి. అధిక విద్యుత్ ఉత్పత్తి కోసం రెండు ముఖ్యమైన ప్రాజెక్టులు భద్రాది, యాదాద్రి తీసుకోవడం జరిగింది. ఈ మద్యనే భద్రాద్రి ప్రాజెక్టు పూర్తి అయినా అధునాతన సాంకేతికతతో నిర్మించలేదని, అలాగే బి.హెచ్.ఇ.ఎల్ వద్ద మిగిలిపోయిన పరికరాలు వాడినట్టు ఆరోపణలు ఉన్నాయి.
యాదాద్రి ప్రాజెక్టులో ఇప్పుడిప్పుడే ఒక యూనిట్లో ఉత్పత్తి మొదలైంది. రాష్ట్ర అవసరాలకు గత 10 ఏండ్లుగా కరెంటును ఇతర రాష్ట్రాల నుంచి అధిక ధరకు కొనుగోలు చేయడంతో రాష్ట్ర విద్యుత్ సంస్థలు
రూ. 90 వేల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయాయి.
అంతటా అవినీతే..
సంక్షేమ పథకాలలోనూ పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. గొర్రెల పెంపకం పథకం ఇందుకు ఉదాహరణ. రెండు పడకల ఇళ్ళ పేరుతో వేల కోట్లు ఖర్చయినా అవినీతితో ఈ పథకం ఎక్కువగా లాభం చేకూర్చలేదు. ఎన్నికలలో లబ్ధి కోసమే అని బాహాటంగా చెపుతూ, దళితబంధు కార్యక్రమం తీసుకొని 4 వేల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసినా లాభం కలుగలేదు. ఇక మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి వాటిలో అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నా ప్రజలకు మంచినీరు, వ్యవసాయానికి కొంత సాగునీరు అందింది.
నియామకాలు: నియామకాలు కొద్దో గొప్పో జరిగినా ఇంకా జరగవలసి ఉంది. పబ్లిక్ సర్వీస్ కమీషన్లో
ప్రశ్నాపత్రాలు లీకేజీ, కోర్టు స్టేలు వంటి వాటితో ప్రభుత్వ ఉద్యోగాల నియామకం సరిగా జరగలేదు. అయితే ఇండస్ట్రియల్ పాలసీ సరళతరం చేయడం, అలాగే విదేశాల నుంచి పెట్టుబడులు రావడంతో కొంతమటుకు ఐ.టి. సెక్టారులో, ఇతర పరిశ్రమల్లో ఉద్యోగాలు లభించాయి. ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాల భర్తీలో కొంత ముందడుగు వేసింది.
ప్రజలకు జరిగిన నష్టం: ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడం, విచ్చలవిడిగా అవినీతి, అధికార కేంద్రీకృతంతో పాలన భ్రష్టుపట్టిపోవడం, కేంద్రంతో సత్సంబంధాలు లేకపోవడంతో కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందలేదు. రాష్ట్రం ఏర్పడిన తరువాత రూ.8 వేల కోట్ల ఆబ్కారీశాఖ వార్షిక ఆదాయం రూ.40 వేల కోట్లకు పెరిగింది. మద్యం తాగేవారి సంఖ్య ఐదు రెట్లు పెరిగింది. కల్తీ కల్లు, డ్రగ్స్ వల్ల ప్రజల ఆరోగ్యం చెడిపోవడం, దానికి తోడు కల్తీకల్లుతో నరాల బలహీనత ఏర్పడి పనిచేసే ఓపిక లేకుండాపోయింది. నేడు తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు వ్యవసాయం, గృహనిర్మాణ రంగం వంటి వాటిలో పనిచేస్తున్నారు.
విద్యారంగం: విద్యారంగం మొత్తంగా నిరాదరణకు గురైంది. యూనివర్శిటీలలో వైస్ చాన్సలర్లు, ఇతర భోదన సిబ్బంది లేక కాలేజీ చదువులు కుంటుపడ్డాయి. ఇక ప్రాథమిక విద్య నేర్పే పాఠశాలలు చాలా చోట్ల శిథిలావస్థలో ఉన్నాయి. అలాగే మౌలిక వసతులు ముఖ్యంగా తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు లేక విద్యార్థులు నానా ఇబ్బందులు పడ్డారు. పేదవారు కూడా అప్పోసప్పో చేసి తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చేర్పించడంతో చాలా సర్కారీ బడులు మూతపడే పరిస్థితి వచ్చింది.
వైద్యరంగం: వైద్యులు, మందుల కొరత, తగిన వైద్య సిబ్బంది లేక గ్రామీణ ప్రాంతాలలో సర్కారీ దవాఖానాలు చాలావరకు సరియైన సేవలు అందించలేకపోయాయి. పేదలు కూడా కార్పొరేట్ ఆసుపత్రులలో డబ్బు ఖర్చుపెట్టి వైద్యం చేయించుకుంటున్నారు. బస్తీ దవాఖానాలు అంటూ ఆర్భాటం చేసినా చాలా ప్రదేశాల్లో అవి మూతపడ్డాయి.
11 ఏండ్ల తెలంగాణ పయనాన్ని పరిశీలిస్తే.. లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగింది. కొత్త ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. మితిమీరిన హామీల వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలోనికి పోతున్నది. రాష్ట్రానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు ఢిల్లీలో జరుగుతున్నాయి. ఎన్నికలై 18 నెలలు గడిచినా ఇంకా పూర్తిస్థాయిలో మంత్రివర్గ కూర్పు కాలేదు. ఏ లక్ష్యం కోసం తెలంగాణ సాధించుకున్నామో ఆ లక్ష్యాలు పూర్తి కావడానికి ప్రస్తుత ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరముంది.
- యం. పద్మనాభరెడ్డి, అధ్యక్షుడు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్–