
- రా. 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో లైవ్
అహ్మదాబాద్: క్వాలిఫయర్–1లో పంజాబ్ కింగ్స్ను చిత్తు చేసి దర్జాగా ఐపీఎల్ ఫైనల్ చేరిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తొలి టైటిల్ వేటలో తనకు సవాల్ విసరబోయే ప్రత్యర్థి కోసం ఎదురు చూస్తోంది. ఆ జట్టు చేతిలో ఘోర ఓటమి ఎదురొన్న పంజాబ్ ఫైనల్ చేరే మరో చాన్స్ను సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది. ఎలిమినేటర్లో అదరగొట్టిన ముంబై ఇండియన్స్తో ఆదివారం జరిగే క్వాలిఫయర్–2 మ్యాచ్లో తలపడనుంది.
లీగ్ దశలో టాపర్గా నిలిచినప్పటికీ ఆర్సీబీ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓటమి శ్రేయస్ అయ్యర్ సేనలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలనే కలతో ఉన్న కింగ్స్కు ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్. మరోవైపు, ఎలిమినేటర్లో టైటిల్ ఫేవరెట్ గుజరాత్ టైటాన్స్ను ఓడించిన ముంబై ఇండియన్స్ ఫుల్ జోష్తో ఆరో టైటిల్ దిశగా మరో అడుగు వేసింది. మరి,సెమీఫైనల్ లాంటి ఈ పోరులో నెగ్గి మంగళవారం ఇదే స్టేడియంలో జరిగే ఫైనల్లో ఆర్సీబీని ఢీకొట్టేది ఎవరో చూడాలి.
జోరు మీద ముంబై
ఐపీఎల్ నాకౌట్ దశల్లో ఎలా ఆడాలో ముంబై ఇండియన్స్కు బాగా తెలుసు. ఐదు టైటిళ్లు ఖాతాలో వేసుకున్న ఆ టీమ్ ఘన చరిత్రే ఇందుకు సాక్ష్యం. జీటీ లాంటి బలమైన జట్టును ఎలిమినేట్ చేయడంతో హార్దిక్ పాండ్యా సేన ఆత్మవిశ్వాసం పెరిగింది. ముఖ్యంగా హిట్మ్యాన్ రోహిత్ శర్మ గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ను ఉతికేసిన తీరు ప్రత్యర్థి బౌలర్లలో భయం పుట్టించింది. మెగా మ్యాచ్ల్లో సత్తా చాటే హిట్మ్యాన్ ఈ పోరులోనూ కీలకం కానున్నాడు.
కొత్తగా జట్టులోకి వచ్చిన ఓపెనర్ జానీ బెయిర్స్టో కూడా హిట్ అవ్వడంతో ముంబై మరింత బలంగా మారింది. గత మ్యాచ్కు ముందు ఆ జట్టులో కొన్ని సమస్యలు ఉన్నా.. టైటాన్స్పై భారీ విజయం తర్వాత ఇప్పుడు ఎలాంటి బలహీనతలు కనిపించడం లేదు. రోహిత్, బుమ్రా, సూర్యకుమార్ సూపర్ ఫామ్ను కొనసాగిస్తుండగా.. గత పోరులో బ్యాటింగ్లో తిలక్ వర్మ, పాండ్యా కూడా రాణించారు. ట్రెంట్ బౌల్ట్ ఎక్కువ రన్స్ ఇచ్చుకున్నప్పటికీ రెండు కీలక వికెట్లు తీసి తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. బెయిర్స్టోతో పాటు కొత్త పేసర్ రిచర్డ్ గ్లీసన్ కూడా కీలక సమయంలో రాణించడం ముంబైకి కలిసొచ్చే అంశం. ఎలిమినేటర్ మాదిరిగా ముంబై మరోసారి సమష్టిగా రాణిస్తే పంజాబ్ పని పట్టడం పెద్ద కష్టమేం కాబోదు.
పంజా విసురుతుందా?
లీగ్ దశలో అద్భుతంగా ఆడిన పంజాబ్ క్వాలిఫయర్–1లో పూర్తిగా తేలిపోయి డీలా పడింది. తమ హోమ్ గ్రౌండ్లో బ్యాటర్లు చేతులెత్తేయగా.. చిన్న టార్గెట్ను కాపాడుకునే ప్రయత్నంలో బౌలర్లూ నిరాశపరిచారు. తొలి టైటిల్ కలను నెరవేర్చుకునేందుకు ముందడుగు వేయాలంటే ఆ ఓటమిని పూర్తిగా మరచి క్వాలిఫయర్–2లో సరికొత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. కెప్టెన్ శ్రేయస్–కోచ్ పాంటింగ్ ఆటగాళ్లలో తిరిగి ఆత్మవిశ్వాసం ఎలా నింపుతారన్నది కీలకం కానుంది. పేసర్ మార్కో యాన్సెన్, స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్లేని లోటు గత మ్యాచ్లో స్పష్టంగా కనిపించింది.
యాన్సెన్ సేవలు కోల్పోయిన నేపథ్యంలో అర్ష్దీప్ సింగ్తో పాటు జెమీసన్, అహ్ముదుల్లా ఒమర్జాయ్ మరింత బాధ్యతగా ఆడాల్సిన అవసరం ఉంది. గాయం నుంచి కోలుకొని స్పిన్నర్ చహల్ బరిలోకి దిగితే పంజాబ్ బౌలింగ్ మెరుగవుతుంది. ఇక, క్వాలిఫయర్–1లో బ్యాటర్లంతా సమష్టిగా విఫలమయ్యారు. దాన్ని తమది కాని రోజుగా భావించి మునుపటి ఫామ్ను చూపెడితేనే పంజాబ్ ముందుకు వెళ్లగలదు. ముంబై బౌలింగ్ అత్యంత పదునుగా ఉంది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా ఏ దశలోనైనా మ్యాచ్ను మలుపు తిప్పగలడని గత పోరుతో మరోసారి నిరూపితమైంది.
కాబట్టి పంజాబ్ ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య–ప్రభ్సిమ్రన్ మంచి ఆరంభం ఇవ్వడంతో పాటు మిడిలార్డర్లో కెప్టెన్ అయ్యర్... చివర్లో స్టోయినిస్, శశాంక్ సింగ్ సమష్టిగా రాణించాల్సి ఉంటుంది. ఈ సీజన్ లీగ్ దశలో ముంబైతో ఆడిన మ్యాచ్లో పంజాబ్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఆ స్ఫూర్తితో ఈసారి కూడా పాండ్యాసేనపై పంజాబ్ పంజా విసురుతుందేమో చూడాలి.
పిచ్/వాతావరణం
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వికెట్పై ఈ సీజన్లో హైస్కోర్లు నమోదయ్యాయి. ఈ స్టేడియంలో ఫస్ట్ ఇన్నింగ్స్ సగటు స్కోరు 176 గా ఉంది. బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడుతున్న నేపథ్యంలో 200 ప్లస్ టార్గెట్ చేసినా కాపాడుకోవడం కష్టమే. కాబట్టి ఇరు జట్లకూ బౌలింగ్ కీలకం కానుంది. ఆదివారం అహ్మదాబాద్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది.