రోసో (డొమినికా): టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిపోర్టర్ అవతారం ఎత్తాడు. వెస్టిండీస్తో తొలి టెస్టు కోసం సోమవారం ప్రాక్టీస్ సెషన్ తర్వాత వైస్ కెప్టెన్ అజింక్యా రహానె మీడియాతో మాట్లాడుతున్న చోటుకి రోహిత్ వచ్చాడు. రిపోర్టర్ల ప్రశ్నలకు రహానె చెబుతున్న సమాధానాలను విన్నాడు. రీఎంట్రీ గురించిన ఓ ప్రశ్నకు బదులిస్తూ తన ఏజ్ 35 ఏండ్లు మాత్రమేనని, తాను యంగ్గానే ఉన్నానని చెప్పడంతో హిట్మ్యాన్ నవ్వు ఆపుకోలేకపోయాడు.
అనంతరం రోహిత్... అంజిక్యాను కొన్ని ప్రశ్నలు అడిగాడు. కరీబియన్ గడ్డపై ఇది వరకు చాలాసార్లు ఆడినందున ఇక్కడి వాతావరణంలో ఎలా బ్యాటింగ్ చేయాలి? టీమ్లోని యంగ్స్టర్స్కు ఏం సలహా ఇస్తావు? అని ప్రశ్నించాడు. ఇక్కడ ఆడుతున్నప్పుడు బ్యాటర్ చాలా ఓపిగ్గా ఉండాలని, గ్రౌండ్పైనే ఫోకస్ పెట్టడం చాలా ముఖ్యమని రహానె చెప్పాడు. ఇంతలో వాన రావడంతో ఈ సరదా సంభాషణకు తెరపడింది. ప్లేయర్లంతా గ్రౌండ్ నుంచి పరుగెత్తుకుంటూ లోపలికి వెళ్లారు.