పొంగులేటి రెండు నాలుకల ధోరణిని ప్రజలు గమనిస్తున్నరు.. ఎమ్మెల్యే సండ్ర

పొంగులేటి రెండు నాలుకల ధోరణిని ప్రజలు గమనిస్తున్నరు.. ఎమ్మెల్యే సండ్ర

సత్తుపల్లి, వెలుగు: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెండు నాలుకల ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విమర్శించారు. రాష్ట్రంలో 2023కు ముందు వరకు కనిపించిన అభివృద్ధి, ఆ తర్వాత కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సత్తుపల్లి మున్సిపల్​ఆఫీసులో సోమవారం నిర్వహించిన మంత్రి కేటీఆర్​పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ‘‘ఏ అధికారం ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎస్కార్ట్ వాడావు? ఏ అధికారం ఉందని నిన్ను కేసీఆర్, కేటీఆర్​హెలికాప్టర్​లో తిప్పారు? నీ ఇంటి ముందు పోలీస్ సెక్యూరిటీ గార్డులను ఎందుకు పెట్టుకున్నావు? నలుగురు గన్ మెన్ లను ఎలా వాడావు?” అంటూ పొంగులేటిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనని దొర అనడం హాస్యాస్పదంగా ఉందని, ఎలాంటి అర్హతలు, అధికారం లేకుండానే పొంగులేటి దొరతనం అనుభవించలేదా అని ప్రశ్నించారు.

దళితులు ఎవ్వరూ వ్యాపారాలు చేయకూడదా, వారి ఎదుగుదలను ఓర్వలేవా అని ఎమ్మెల్యే సండ్ర వీరయ్య నిలదీశారు. సత్తుపల్లిలో నాలుగు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు తీసేసి, ఒక్కటే నడిపించగల సత్తా ఉందా అని సవాల్​విసిరారు. సత్తుపల్లి కాంగ్రెస్​అభ్యర్థిని ప్రకటించే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పంచన చేరి నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ వనమా వాసుదేవరావు, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుళ్ల కృష్ణయ్య, పలువురు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. అంతకు ముందు కళాకృతి ఫైనాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 47 రకాల కేటీఆర్ పెయింటింగ్స్ ఎగ్జిబిషన్​ను ఎమ్మెల్యే సండ్ర 
ప్రారంభించారు.