న్యూఢిల్లీ: ఎర్రకోట పేలుడు కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. వైట్కాలర్ టెర్రర్ మాడ్యూల్టీం దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నినట్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) అధికారులు గుర్తించారు. ఇందుకోసం 2023 నుంచి అంటే రెండేండ్లనుంచి సిద్ధమవుతున్నట్టు నిందితుల్లో ఒకడైన ఉగ్ర డాక్టర్ముజమ్మిల్ షకీల్ అంగీకరించినట్టు సమాచారం. ఈమేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఢిల్లీ బ్లాస్ట్లో చనిపోయిన సూసైడ్ బాంబర్ ఉమర్ నబీతో సంబంధాలున్న పలువురు అనుమానితులను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దేశవ్యాప్త దాడుల కోసం భారీ ప్లాన్ వేశామని, పేలుడు, బాంబు తయారీ పదార్థాలు, రిమోట్లు సేకరిస్తున్నానని అనుమానితుల్లో ముజమ్మిల్ షకీల్ ఒప్పుకున్నాడు. తనకు యూరియా, అమ్మోనియా నైట్రేట్ను కొనుగోలు బాధ్యతలు అప్పగించారని వెల్లడించినట్టు తెలుస్తున్నది.
హర్యానాలోని గురుగ్రాం, నూహ్ నుంచి రూ.3లక్షలతో ఎన్పీకే ఎరువులు, ఫరీదాబాద్లోని మార్కెట్లనుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను, ఎరువులను భద్రపరిచేందుకు డీప్ ఫ్రీజర్ను కొన్నట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. వీటితో బాంబులు తయారుచేసే విధానాన్ని బాంబర్ ఉమర్.. ఆన్లైన్లో చూసి నేర్చుకున్నాడని గుర్తించారు.
సొంతంగా నిధులు
ఈ పేలుళ్ల కుట్రకు ఉగ్ర డాక్టర్లే నిధులు సమకూర్చుకున్నట్టు దర్యాప్తులో తేలింది. పేలుడు పదార్థాలను కొనేందుకు రూ.26 లక్షలు జమచేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆ మొత్తాన్ని బాంబర్ ఉమర్కు ఇచ్చారని, అతడు కూడా రూ.2 లక్షలు సమకూర్చాడని తెలిపాయి. తాను రూ.6.5 లక్షలు పెట్టి ఏకే-47 రైఫిల్ కొన్నట్లు కూడా ముజమ్మిల్ అంగీకరించాడని పేర్కొన్నాయి. దానిని కాశ్మీర్కు చెందిన మరో డాక్టర్ ఆదిల్ రాథర్ లాకర్ నుంచి స్వాధీనం చేసుకున్నారు.
తమ హ్యాండ్లర్లు మన్సూర్, ఉమర్ అని, వారు ఇబ్రహీం అనే వ్యక్తి ఆదేశాలకు తగ్గట్టుగా పనిచేస్తారని ముజమ్మిల్ షకీల్ అంగీకరించినట్టు తెలిసింది. ఒకాసా ఆదేశాల మేరకు ముజమ్మిల్, ఆదిల్, ముజఫర్ కలిసి తుర్కియేలో పర్యటించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఒకాసాకు తెహ్రీకే తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) ఉగ్రసంస్థతో సంబంధాలున్నట్టు తేలిందని చెప్పాయి. అక్కడినుంచి అఫ్గానిస్తాన్లోకి ప్రవేశించాలని ప్లాన్ వేసుకోగా.. తమ హ్యాండ్లర్ వెనక్కివచ్చేసినట్టు ముజమ్మిల్ తెలిపాడని పేర్కొన్నాయి. వీరంతా టెలిగ్రాం ద్వారా సంభాషించుకునేవారని తేలింది.
పాక్ నుంచి డ్రోన్లతో ఆయుధాల స్మగ్లింగ్
పాకిస్తాన్ నుంచి డ్రోన్ల సాయంతో భారత్ లోకి ఆయుధాలను స్మగ్లింగ్ చేస్తున్న అంతర్జాతీయ ఆయుధ స్మగ్లింగ్ రాకెట్ ను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) తో సంబంధం ఉన్న సిండికేట్ ఆ వెపన్స్ ను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. టర్కీ, చైనాలో తయారైన ఆయుధాలను దేశంలోని వివిధ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా జారవిడుస్తున్నారు.
ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని పంజాబ్ కు చెందిన మన్ దీప్, ఉత్తరప్రదేశ్ కు చెందిన అతని ఇద్దరు అనుచరులు రోహన్, మోనుగా గుర్తించారు. నిందితుల నుంచి 10 ఫారెన్ పిస్టళ్లు, 92 లైవ్ క్యాట్రిడ్జ్ లను స్వాధీనం చేసుకున్నారు. మన్ దీప్కు సోను ఖత్రీ గ్యాంగ్తో సంబంధాలు ఉన్నాయి.
పలు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. దేశంలోని గుర్తించిన ప్రాంతాల్లో ముఠా సభ్యులు డ్రోన్ల ద్వారా ఆయుధాలను జారవిడుస్తున్నట్లు గుర్తించారు. వెపన్లను స్కానర్లు డిటెక్ట్ చేయకుండా వాటిని ర్యాపర్లలో చుట్టి పంపారు. డ్రోన్లు ఆయుధాలను జారవిడిచాక గ్యాంగ్ మెంబర్లు వాటిని సేకరించి ఢిల్లీ, సమీపంలోని రాష్ట్రాల్లో క్రిమినల్స్కు చేరవేస్తున్నారు.
=================================================================
