
- మరో మూడు రోజుల్లో మెగా ఈవెంట్
మల్టీ స్పోర్ట్స్ ఈవెంట్స్ కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్లో ఇండియన్స్ మెడల్స్ మోత మోగిస్తుంటారు. గతేడాది కామన్వెల్త్లో 61 పతకాలు రాబట్టారు. 2022లోనే జరగాల్సిన ఆసియా గేమ్స్ కరోనా కారణంగా 2023కి వాయిదా పడ్డాయి. చైనాలోని హాంగ్జౌలో ఈ నెల 23న మొదలయ్యే ఆసియా గేమ్స్లో అదరగొట్టేందుకు పలువురు వెటరన్ స్టార్స్ రెడీ అయ్యారు. టెన్నిస్ లెజెండ్ రోహన్ బోపన్న, హాకీ గ్రేట్ పీఆర్ శ్రీజేష్, టీటీ మేటి ఆటగాడు శరత్ కమల్, రెజ్లింగ్ హీరో బజ్రంగ్ పునియా.. విమెన్స్లో దీపిక పల్లికల్, సీమా పునియా కెరీర్ చివర్లో ఉన్నారు. ఈ ఎడిషన్ఆసియా గేమ్స్ వీళ్లకు చివరిదయ్యే అవకాశం ఉండగా.. పతకాల రేసులో ఎవరెలా ఉన్నారో చూద్దాం..!
రోహన్ బోపన్న, అంకిత
43 ఏండ్ల టెన్నిస్ వెటరన్ బోపన్న ఈ ఏడాది మెన్స్ డబుల్స్లో సూపర్ పెర్ఫామెన్స్ చేస్తున్నాడు. వింబుల్డన్లో సెమీస్ చేరిన అతను యూఎస్ ఓపెన్లో రన్నరప్గా నిలిచాడు. భారీ సర్వీసులతో అదరగొట్టే రోహన్ ఏజ్ కేవలం నంబర్ మాత్రమే అని నిరూపిస్తున్నాడు. ఈ వారమే డేవిస్ కప్ను విజయంతో ముగించిన బోపన్న ఆసియాడ్ మెన్స్ డబుల్స్ ఈవెంట్లో కూడా అదే రిపీట్ చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. 2002లో ఆసియా గేమ్స్లో అరంగేట్రం చేసిన బోపన్న 2018 ఎడిషన్లో దివిజ్ శరణ్తో కలిసి డబుల్స్లో గోల్డ్ మెడల్ గెలిచాడు. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతున్న అతను యూకీ భాంబ్రీతో కలిసి ఆడనున్నాడు. టెన్నిస్లో మెడల్ నెగ్గే సత్తా ఉన్న
మరో ప్లేయర్ అంకితా రైనా. 30 ఏండ్ల స్టార్ ప్లేయర్ 2018 ఎడిషన్లో బ్రాంజ్ నెగ్గింది. లెజెండరీ ప్లేయర్ సానియా మీర్జా తర్వాత ఆసియా గేమ్స్లో సింగిల్స్ పతకాన్ని గెలుచుకున్న ఇండియా రెండో మహిళా టెన్నిస్ ప్లేయర్గా నిలిచింది. ఆమె ఈసారి డబుల్స్, మిక్స్డ్ డబుల్స్లోనూ బరిలోకి దిగనుంది.
పీఆర్ శ్రీజేష్
హాకీ టీమ్ ఈవెంట్ అయినప్పటికీ ఇండియా మెన్స్ టీమ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్. ఆసియా గేమ్స్లో తను చివరిసారి బరిలోకి దిగబోతున్నాడు. ఎంతో అనుభవం ఉన్న శ్రీజేష్ జట్టుకు గోల్డ్ మెడల్ అందించాలని చూస్తున్నాడు. అదే జరిగితే వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్కు ఇండియా నేరుగా క్వాలిఫై అవ్వనుంది. శ్రీజేష్ ఇప్పటిదాకా 301 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. గత ఆసియా గేమ్స్లో కాంస్యంతో సరిపెట్టిన ఇండియా ఈసారి బంగారు పతకంతో తిరిగి వచ్చేందుకు అతను కీలకం కానున్నాడు.
బజ్రంగ్, సీమా పునియా
డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా జరిగిన నిరసనకు నాయకత్వం వహించిన ఇండియా స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియా ఆసియా గేమ్స్తోనే తిరిగి మ్యాట్పైకి రానున్నాడు. గత ఎడిషన్లో గోల్డ్ నెగ్గిన బజ్రంగ్ హాంగ్జౌలో తన 65 కేజీల టైటిల్ను నిలబెట్టుకోనున్నాడు. ఏజ్ దృష్ట్యా అతనికిదే చివరి ఆసియా ఈవెంట్ కానుంది. జకార్తాలో గోల్డ్ మెడల్కు 2014 ఎడిషన్లో సిల్వర్ సాధించాడు. ఇక, 40 ఏండ్ల డిస్కస్ త్రోయర్ సీమా పునియా గత రెండు ఎడిషన్లలో గోల్డ్, బ్రాంజ్ నెగ్గింది. గతేడాది బర్మింగ్హామ్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో మెడల్ సాధించలేకపోయింది. తనకు చివరిదైన ఆసియా గేమ్స్లో పోడియంపై నిలబడాలని ఆశిస్తోంది.
దీపికా పల్లికల్
ఇద్దరు పిల్లల తల్లి అయినా ఆటను కొసాగిస్తున్న ఇండియా స్క్వాష్ స్టార్ దీపికా పల్లికల్ ఆసియా గేమ్స్లో నాలుగో, చివరిసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 32 ఏండ్ల దీపిక ఆసియాలో ఇప్పటిదాకా రెండు సింగిల్స్, మరో రెండు టీమ్ మెడల్స్ సాధించింది. ఈ సారి తను కేవలం మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో హరీందర్పాల్ సంధుతో కలిసి పోటీ పడనుంది. జూన్లో హాంగ్జౌలో జరిగిన టెస్టింగ్ ఈవెంట్లో నెగ్గిన దీపిక–హరీందర్ మంచి ఫామ్లో ఉన్నారు.
శరత్ కమల్
టేబుల్ టెన్నిస్ స్టార్, 41 ఏండ్ల శరత్ కమల్ తన ఐదో, చివరి ఆసియా గేమ్స్లో రెండు మెడల్స్పై గురి పెట్టాడు. గతేడాది జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో మూడు గోల్డ్ మెడల్స్ నెగ్గి ఔరా అనిపించాడు. ఆసియా గేమ్స్కు ముందు పెద్దగా ఫామ్లో లేనప్పటికీ మెగా ఈవెంట్లో బరిలోకి దిగిన తర్వాత తను చెలరేగిపోతాడని ఆశించొచ్చు. గత ఎడిషన్లో శరత్తో కూడిన మెన్స్ టీమ్ బ్రాంజ్ నెగ్గి ఆసియా గేమ్స్ టీటీ ఈవెంట్లో 60 ఏళ్ల పతక నిరీక్షణను ముగించింది. అలాగే మనికా బత్రాతో కలిసి మిక్స్డ్లోనూ శరత్ కమల్ బ్రాంజ్ గెలిచాడు. ఈ గేమ్స్లో ఇండియా టీటీకి అదే బెస్ట్ పెర్ఫామెన్స్. కామన్వెల్త్ గేమ్స్తో పోలిస్తే ఆసియాలో పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యే ఆసియా చాంపియన్షిప్స్లో కాంస్య పతకం గెలిచిన శరత్, సత్యన్, హర్మీత్ దేశాయ్ త్రయం హాంగ్జౌలోనూ పతకం గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఎడిషన్లో శరత్లో కలిసి ఆడిన విమెన్స్ స్టార్ ప్యాడ్లర్ మనిక ఈ సారి సత్యన్తో జతకట్టనుంది.