కేంద్ర కేబినెట్లోకి అమిత్ షాను తీసుకుంటే.. మరి ఆయన నిర్వహిస్తున్న బీజేపీ చీఫ్ పోస్టు ఎవరికి? ఇప్పుడు కమలనాథుల్లో చక్కర్లు కొడుతున్న ప్రశ్న ఇది. గురువారం సాయంత్రం ప్రధానిగా మోడీ ప్రమాణం చేయనుండటం, ఆయనతోపాటు కొందరు మంత్రులుగా కూడా ప్రమాణం చేయనుండటంతో ఎవరికి బీజేపీ చీఫ్ పదవి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీని విజయతీరాలకు చేర్చడంలో మోడీ, అమిత్ షా జోడీ సక్సెస్ అయింది. దీంతో అమిత్ షాకు కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని, కీలకమైన హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగ శాఖల్లో ఏదో ఒక శాఖ ఆయనకు లభించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. కేబినెట్లోకి షా వెళ్తే బీజేపీ చీఫ్ పోస్టు ఖాళీ అవుతుంది. ఆ పోస్టుకు ముగ్గురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
అందులో మొన్నటి మోడీ కేబినెట్లో మంత్రులుగా పనిచేసిన జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్తో పాటు రాజ్యసభ్యుడు భూపేంద్ర యాదవ్ ఉన్నారు. వీరు అమిత్ షాకు అత్యంత సన్నిహితులు. 2014 ఎన్నికల్లో బీజేపీ చీఫ్గా ఉన్న రాజ్నాథ్ సింగ్ నాడు పార్టీ అధికారంలోకి రావడంతో కేంద్ర కేబినెట్లో చేరారు. దీంతో బీజేపీ చీఫ్గా షా నియమితులయ్యారు. షా బాధ్యతలు చేపట్టాక దాదాపు ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ మంచి ఫలితాలు సాధిస్తూ వచ్చింది. లోక్సభ ఎన్నికల్లోనూ షా వ్యూహం ఫలించింది. ‘అబ్కీ బార్ 300 ప్లస్’ నినాదంతో ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 6వ దశ పోలింగ్ ముగిసిన వెంటనే.. తమకు 300కు పైగా సీట్లు వస్తాయని షా లెక్కలు వేశారు. రిజల్ట్స్లో అది రుజువైంది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ.. ఎప్పటికప్పుడూ వ్యూహాలు మారుస్తూ.. పార్టీకి మంచి ఫలితాలను అందిస్తున్న అమిత్ షా కేంద్ర కేబినెట్లోకి వెళ్తే ఆ స్థాయిలో వ్యూహాలు రచించే నాయకులు బీజేపీలో లేరని పార్టీ వర్గాలు అంటున్నాయి.
యూపీలో బీజేపీ గెలుపు నడ్డాకు ప్లస్
జేపీ నడ్డా మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్కు పార్టీ ఇన్చార్జ్గా వ్యవహరించారు. ఆ రాష్ట్రంలో ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కూటమిగా ఏర్పడటంతో బీజేపీకి భారీ స్థాయిలో సీట్లు తగ్గిపోతాయని ప్రీపోల్ సర్వేలు అంచనా వేశాయి. నడ్డా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్లారు. అది ఫలించి యూపీలో బీజేపీ 62 సీట్లు సాధించింది. ఇది నడ్డాకు ప్లస్ కానుంది. మోడీ ఫస్ట్ టర్మ్లో ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. హిమాచల్ప్రదేశ్కు చెందిన నడ్డా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు కార్యదర్శిగా కూడా ఉన్నారు.
ఒడిశాలో వ్యూహం ప్రధాన్కు ప్లస్
కేంద్ర పెట్రోలియం మంత్రి పనిచేసిన ధర్మేంద్ర ప్రధాన్ లోక్సభ ఎన్నికల్లో ఒడిశాలో బీజేపీ ఇన్చార్జిగా పనిచేశారు. అక్కడ 2014లో ఒక్క లోక్సభ సీటుకే పరిమితమైన పార్టీ ఈసారి 8 చోట్ల విజయం సాధించింది. దీని వెనుక ధర్మేంద్ర ప్రత్యేక వ్యూహం అమలు చేశారు. నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బీజేడీకి కంచుకోటగా ఉన్న ఒడిశాలో
బీజేపీ 8 సీట్లు గెలువడం ఆశామాషి వ్యవహారం కాదు. ఇదే ప్రధాన్కు కలిసివచ్చే అవకాశం ఉంది. ఒడిశాకు చెందిన ప్రధాన్.. రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
బీహార్లో విక్టరీ భూపేంద్రకు ప్లస్
రాజస్థాన్కు చెందిన భూపేంద్ర యాదవ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీహార్లో బీజేపీ ఇన్చార్జిగా పనిచేశారు. అక్కడ బీజేపీ, జేడీయూ కలిసి పోటీ చేసి..మొత్తం 40 సీట్లలో 39 సీట్లను గెలుచుకుంది. దీని వెనుక భూపేంద్ర కృషి ఉంది. ఒకప్పుడు రాష్ట్రాన్ని ఏలిన ఆర్జేడీకి ఒక్క సీటు కూడా దక్కకుండా పక్కా స్కెచ్తో ముందుకు వెళ్లారు. గతంలోనూ పలు రాష్ట్రాలకు భూపేంద్ర ఇన్చార్జిగా వ్యవహరించి మంచి ఫలితాలు రాబట్టగలిగారు.