న్యూఢిల్లీ: హోల్సేల్ ధరల పెరుగుదలను కొలిచే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్యూపీఐ) ఈ ఏడాది ఫిబ్రవరిలో 11 నెలల గరిష్ట స్థాయికి చేరి 2.13 శాతంగా నమోదైంది. ఆహార, ఆహారేతర వస్తువుల ధరలు పెరగడమే ఇందుకు కారణం.
ఈ ఏడాది జనవరిలో హోల్సేల్ ద్రవ్యోల్బణం1.81 శాతంగా, కిందటేడాది ఫిబ్రవరిలో 2.45 శాతంగా ఉంది. కిందటి నెలలో ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం జనవరిలోని 1.55 శాతం నుంచి 2.19 శాతానికి పెరిగింది. కూరగాయల ధరలు తగ్గినా, పప్పులు, బంగాళాదుంపలు, గుడ్లు, మాంసం, చేపల ధరలు పెరిగాయి. తయారీ ఉత్పత్తుల ధరలు 2.92 శాతం పెరిగాయి.
ఆహారేతర ద్రవ్యోల్బణం 8.80 శాతానికి చేరింది. ఇంధనం, విద్యుత్ విభాగంలో డిఫ్లేషన్ (ధరలు తగ్గడం) 3.78శాతంగా ఉంది. అమెరికా–ఇరాన్ యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయని, ఫలితంగా హోల్సేల్ ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని, మార్చిలో 3.7 శాతానికి చేరొచ్చని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం కొలిచే సీపీఐ ఫిబ్రవరిలో 3.2 శాతంగా నమోదైన విషయం తెలిసిందే.
