మెదక్/శివ్వంపేట, వెలుగు: ‘మా స్కూల్ బిల్డింగ్ శిథిలావస్థలో ఉంది. ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న స్కూల్లో సౌకర్యాలు మెరుగు పర్చకుండా ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం ఎందుకు?’ అని మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చెన్నాపూర్ గ్రామంలోని ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్అన్నారు. జడ్పీ చైర్పర్సన్ హేమలత, నర్సాపూర్ఎమ్మెల్యే మదన్ రెడ్డి శనివారం చెన్నాపూర్లో పల్లెప్రగతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ హెచ్ఎం లావణ్య మాట్లాడుతూ తమ స్కూల్లో 54 మంది చదువుకుంటున్నారని చెప్పారు. బిల్డింగ్ కూలిపోయే దశలో ఉందని గతంలోనే చెప్పామని, మన ఊరు మన బడి కార్యక్రమం ఫస్ట్ ఫేజ్లోనే తమ స్కూల్ సమస్య తీరుతుందనుకున్నామని, కానీ అలా జరగలేదని వాపోయారు. స్కూల్కు కొత్త బిల్డింగ్ నిర్మించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ మేరకు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. సెకండ్ ఫేజ్ లో చెన్నాపూర్ స్కూల్కు రెండు గదులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.