జీడిమెట్ల, వెలుగు : హైదరాబాద్లో మల్లారెడ్డి నారాయణ యాజమాన్యం మొట్టమొదటిసారి కిడ్నీ మార్పిడి చికిత్సను విజయవంతం చేసిందని మల్లారెడ్డి హెల్త్సిటీ చైర్మన్ భద్రారెడ్డి తెలిపారు. గురువారం సూరారంలోని ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బౌరంపేటకు చెందిన నవీన్కు కిడ్నీ దెబ్బతింది. అతని భార్య కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చారు.
దీంతో ఆస్పత్రికి చెందిన ఎం.గోపి కిషోర్, డా.కె.శేషుమోహన్, డా.సూర్యనారాయణ్, డా.సంగీత, డా.రాధా రమణమూర్తి టీమ్ అత్యాధునిక పరికరాలతో , అతితక్కువ ఖర్చుతో కిడ్నీ మార్పిడి చేశారని భద్రారెడ్డి వివరించారు. దంపతులు ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైద్య బృందాన్ని అభినందించారు. అనంతరం జీవన్దాన్ ప్రోగ్రాం ఇన్చార్జ్ జి.స్వర్ణలత మాట్లాడుతూ ప్రజల్లో అవయవదానాలపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కిడ్నీ మార్పిడి చేసినందుకు మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రి యాజమాన్యాన్ని అభినందించారు.