బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు, ఫించన్లు ఇస్తామని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ హామీ ఇచ్చారు. రైతులకు వరి కనీస మద్దతు ధర రూ. 3100 లు చెల్లిస్తామని చెప్పారు. తీగలగుట్టపల్లి, ఇరుకుల్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు సంజయ్. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులకు ఓటేస్తే మీ ఇండ్లను కూడా కబ్జా చేస్తారని ఆరోపించారు. భూకబ్జా, బ్లాక్ మెయిల్, చీటింగ్ కేసులు బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్ధుల సొంతమని విమర్శించారు.
రేషన్ కార్డులు, బీసీ బంధు ఇవ్వలేనోడు రేషన్, బీసీ శాఖ మంత్రి, ఇంట్లో అందరికీ పదవులిచ్చుకుని నిరుద్యోగులకు ఒక్క కొలువు ఇవ్వలేనోడు సీఎం అంటూ కేసీఆర్, గంగులను విమర్శించారు సంజయ్. గంగులకు ధైర్యముంటే అవినీతి, అభివృద్ది, ఆస్తులపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. జీవితాన్ని పణంగా పెట్టి ప్రజల కోసం తాను పోరాడుతున్నానని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.