అధ్యక్ష పదవి అడుగుతా ఇస్తారా? లేదా? అనేది పార్టీ ఇష్టం: రాజాసింగ్

అధ్యక్ష పదవి అడుగుతా ఇస్తారా? లేదా? అనేది పార్టీ ఇష్టం: రాజాసింగ్

హైదరాబాద్, వెలుగు:  తాను కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అడుగుతానని, ఇస్తారా? లేదా? అనేది పార్టీ ఇష్టమని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.  తనకు అధ్యక్ష పదవి దక్కదని తెలిసినా ప్రయత్నం చేయడంలో తప్పు లేదని పేర్కొన్నారు. నామినేషన్ తేదీలు ప్రకటించిన తర్వాత నామినేషన్ వేయాలా? వద్దా? అనే దానిపై ఆలోచిస్తానని తెలిపారు. రాజాసింగ్ తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, హిందూ ధర్మం పట్ల తన అంకితభావాన్ని శనివారం ఒక ప్రకటనలో గుర్తు చేసుకున్నారు.

1995 నుంచి తాను హిందూ వాహినిలో కార్యకర్తగా పనిచేశానని, 1995 నుంచి 2009 వరకు హిందూ వాహిని ఫిజికల్ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నానని తెలిపారు.  2009లో  మంగళహాట్ డివిజన్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ టికెట్  అడిగినా అధిష్టానం ఇవ్వలేదని, అందుకే టీడీపీ నుంచి టికెట్ తీసుకొని పోటీ చేసి గెలిచానని చెప్పారు. 2014లో  బీజేపీలో చేరి గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించినట్టు తెలిపారు. ధర్మసేవ కోసం ఎన్నోసార్లు జైలుకు వెళ్లానని, 1998, 2010, 2012 సంవత్సరాల్లో అనేకసార్లు జైలు శిక్ష అనుభవించినట్టు పేర్కొన్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా 77 రోజులు జైలులో ఉన్నానని రాజాసింగ్ వెల్లడించారు.