ఇంటర్ ప్రాక్టికల్స్ పై
ఇంకా తేల్చని సర్కారు
సెల్ఫ్ సెంటర్లలోనే
కొనసాగుతున్న ప్రాక్టికల్స్
కాలేజీల్లో పూర్తిస్థాయిలో కనిపించని ల్యాబ్స్
అందుకే జంబ్లింగ్ అమలు వాయిదా: బోర్డు
కార్పొరేట్కాలేజీల ఒత్తిడివల్లే: స్టూడెంట్స్యూనియన్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానం అమలుపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామని అధికారులు చెబుతున్నా.. ఈ ఏడాది కూడా జంబ్లింగ్ విధానం అమలయ్యే పరిస్థితి కనిపించడంలేదని నిపుణులు చెబుతున్నారు. గతేడాదిలానే ఇప్పుడు కూడా చివరి నిమిషంలో జంబ్లింగ్ లేదని ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. రాష్ట్రంలో మొత్తం 2,558 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. అందులో పది లక్షల మంది స్టూడెంట్లు చదువుతున్నారు. సెకండియర్లో దాదాపు 2 లక్షల మంది సైన్స్(ఎంపీసీ, బైపీసీ) స్టూడెంట్లు ఉన్నారు. సైన్స్స్టూడెంట్లకు ఏటా జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటివారంలో ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఇందులో ఎంపీసీ స్టూడెంట్లకు 60 మార్కులు, బైపీసీ స్టూడెంట్లకు 120 మార్కులు ఉంటాయి. ఎంసెట్లో ఇంటర్ మార్కులకు వెయిటేజ్ ఉండడంతో సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ మార్కులు కీలకంగా మారుతున్నాయి.
సెల్ఫ్ సెంటర్లలోనే ప్రాక్టికల్స్ నిర్వహించడంతో ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు ఇష్టారాజ్యంగా మార్కులు వేసుకుంటున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఇంటర్ ప్రాక్టికల్స్లోనూ జంబ్లింగ్ విధానం అమలుచేయాలని స్టూడెంట్ యూనియన్లు, విద్యావేత్తలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు. ఏటా ఈ విద్యాసంవత్సరం నుంచి జంబ్లింగ్ విధానం అమలుచేస్తామని ప్రకటించడం.. చివరి నిమిషంలో ఏదో ఒక కారణంచెప్పి జంబ్లింగ్ను వచ్చే ఏడాదికి వాయిదా వేయడం జరుగుతోంది. ఈ ఏడు కూడా జంబ్లింగ్ అమలుచేసే పరిస్థితి కనిపించడంలేదనే అభిప్రాయాలు వినబడుతున్నాయి. దీనికి ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల ఒత్తిడే కారణమనే విమర్శలూ ఉన్నాయి.
కాలేజీల్లో ల్యాబ్లు ఉన్నాయా..?
ప్రైవేటు కాలేజీలకు ఇంటర్ బోర్డ్ అనుమతి రావాలంటే కాలేజీలో సైన్స్ల్యాబ్ ఉండాల్సిందే.. కానీ అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేసి, ల్యాబ్లు లేకున్నా గుర్తింపు ఇచ్చేస్తున్నారు. సర్కారుతో పాటు కొన్ని ప్రైవేటు కాలేజీల్లో ల్యాబులు పేరుకే ఉంటయి.. వాటిలో పరికరాలు, కెమికల్స్ ఉండవు. చాలా కార్పొరేట్ కాలేజీలు తమ విద్యార్థులతో ల్యాబ్లలో కనీసం ఒక్క పరీక్ష కూడా చేయించకున్నా.. లెక్చరర్లతో ఫుల్ మార్కులు వేయిస్తున్నాయని విమర్శలున్నాయి. చాలా మంది విద్యార్థులకు కనీసం పరికరాలు, కెమికల్స్పేర్లు కూడా తెలియవని గతంలో ప్రాక్టికల్స్పరీక్షలకు పర్యవేక్షకులుగా వెళ్లిన అధికారులు చెప్తున్నారు. కొంతమంది విద్యార్థుల రికార్డులు కూడా వేరే వారితో రాయించడం లేదా పాత రికార్డులనే చూపించడం చేస్తుంటారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
డబ్బులిస్తేనే మార్కులు..
ప్రాక్టికల్పరీక్షలు సెల్ఫ్ సెంటర్లలో జరుగుతుండటంతో మేనేజ్మెంట్ల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. ఎంసీపీ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బైపీసీ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు బాటనీ, జువాలజీ ప్రాక్టికల్స్ ఉంటాయి. ఒక్కో సబ్జెక్ట్కు 30 మార్కులు ఉంటాయి. అయితే ఇంటర్లో వచ్చే ఒక్కో మార్కు, ఎంసెట్మార్కులను తారుమారు చేస్తుంది. దీంతో ప్రాక్టికల్స్ను పేరెంట్స్కూడా కీలకంగా తీసుకుంటారు. దీన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్లు ఒక్కో సబ్జెక్ట్కు రూ.2 వేల నుంచి 10వేల వరకూ వసూలు చేస్తుంటాయి. ఈ డబ్బులను పర్యవేక్షణకు వచ్చే అధికారులకు ఇవ్వాల్సి ఉంటుందని చెబుతుంటారు. మరోపక్క కార్పొరేట్ కాలేజీలు ర్యాంకుల కోసం ప్రాక్టికల్ మార్కులనూ కీలకంగానే చూస్తాయి. జంబ్లింగ్ విధానం అమలైతే, తమ స్టూడెంట్స్కు తక్కువ మార్కులు వచ్చే అవకాశముందని, కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్లు వ్యతిరేకిస్తున్నాయి. కాలేజీలలో వసతులు లేవనే కారణం చూపిస్తూ అధికారులు ఏటా వెనక్కి తగ్గుతున్నారు. ఈ ఏడు కూడా జంబ్లింగ్ విధానం అమలు చేయాలా వద్దా అనేది ఆలోచిస్తామంటూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇటీవల ప్రకటించడం గమనార్హం.
పరిశీలిస్తున్నాం.. త్వరలో నిర్ణయం: ఉమర్ జలీల్
ఈ విద్యాసంవత్సరం ఇంటర్ ప్రాక్టికల్స్లో జంబ్లింగ్ విధానం అమలు చేయడంపై పరిశీలిస్తున్నాం. అన్ని కాలేజీల్లో వసతులు ఉన్నాయా లేవా అనే దాని చూస్తున్నాం. త్వరలోనే దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం.