
బషీర్బాగ్, వెలుగు: వైన్షాపులు రూల్స్ బ్రేక్ చేయడం వల్ల బార్ షాపులకు నష్టం వాటిల్లుతోందని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపించారు. సోమవారం వారు ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావును తన కార్యాలయంలో కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా వైన్ షాపులు నడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. వంద చదరపు గజాల్లో ఉండాల్సిన సిట్టింగ్ రూమ్ లు ఎకరా స్థలంలో తినుబండారాలతో బార్ తరహాలో నడుపుతున్నారని అన్నారు.
గ్రేటర్ పరిధిలో రాత్రి 11 గంటల వరకు కాకుండా 10 గంటల వరకే వైన్షాపులకు అనుమతి ఇవ్వాలన్నారు. ప్రతీ బార్ కు, వైన్ షాపునకు మధ్య 100 మీటర్ల దూరం అనే నిబంధనను పట్టించుకోవడం లేదని వాపోయారు. దీంతో బార్లు సరిగ్గా నడవడం లేదన్నారు. ప్రభుత్వం అక్టోబర్ లో కొత్త మద్యం పాలసీ తీసుకొస్తుందని.. అందులో తమ సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.