
- మంత్రి జూపల్లిని కలిసిన వింగ్ కమాండర్ యాకుబ్ అలీ
హైదరాబాద్, వెలుగు: దేశ సేవ కోసం యువత ముందుకు రావాలని, ఈ విషయంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం సెక్రటేరియెట్లో మంత్రి జూపల్లిని 12 ఎయిర్మెన్ సెలెక్షన్ సెంటర్ (ఏఎస్సీ) కొత్త కమాండింగ్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టిన వింగ్ కమాండర్ యాకుబ్ అలీ మర్యాదపూర్వకంగా కలిశారు. అగ్నివీర్లో చేరేందుకు తెలంగాణ యువత ఆసక్తి చూపడం లేదని యాకుబ్ అలీ వివరించారు.
భారత వైమానిక దళంలో అపారమైన ఉద్యోగగావకాశాలున్నాయని, యువతలో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని నియామక శిబిరాలు నిర్వహించి యువతను ఉత్తేజపర్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. యాకుబ్ అలీ చేస్తున్న ప్రయత్నాలను మంత్రి అభినందించారు. అగ్నివీర్లో చేరేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. యువతకు ఉపాధి కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.