గ్రాడ్యుయేషన్​ లేకున్నా హిందీ టీచర్​ పోస్టులు​

గ్రాడ్యుయేషన్​ లేకున్నా హిందీ టీచర్​ పోస్టులు​

టీఎస్​పీఎస్​సీ నియామకాల తీరుపై అనుమానాలు  ​

మంచిర్యాల, వెలుగు: హిందీ టీచర్లు, పండిట్ల నియామకంలో టీఎస్​పీఎస్​సీ జీవో నంబర్​ 25ను పాటించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ చేయనివాళ్లు ఈ పోస్టులకు అనర్హులని జీవో చెప్తున్నా టీఎస్​పీఎస్​సీ అందుకు భిన్నంగా సెలక్షన్స్ ​చేశారని, ఇందులో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. స్కూల్​ఎడ్యుకేషన్(జనరల్) డిపార్ట్​మెంట్​2017 అక్టోబర్​10న టీచర్స్ ​రిక్రూట్​మెంట్​రూల్స్​కు సంబంధించి జీవో ఎంఎస్​ నంబర్​ 25 రిలీజ్​ చేసింది. దీని ప్రకారం టీఎస్​పీఎస్​సీ రాష్ట్ర వ్యాప్తంగా158 హిందీ స్కూల్​ అసిస్టెంట్, 352 హిందీ లాంగ్వేజ్​ పండిట్​ పోస్టుల రిక్రూట్​మెంట్​కోసం ఆ ఏడాది అక్టోబర్​ 21న నోటిఫికేషన్​ రిలీజ్​చేసింది. ఆన్​లైన్​లో అప్లికేషన్లు తీసుకుంది. నోటిఫికేషన్​లో పేర్కొన్నట్టు సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్​ లేకున్నా విద్వాన్, మధ్యమ విశారద సర్టిఫికెట్లతో పీజీ చేసిన అభ్యర్థులు సైతం అప్లై చేసుకున్నారు. అప్లికేషన్స్​ను స్క్రూటినీ చేసి క్వాలిఫికేషన్ ​లేనివాళ్లను రిజెక్ట్​ చేయాల్సినప్పటికీ పట్టించుకోకుండా అందరికీ హాల్ ​టికెట్స్​ జారీ చేశారు. 2018 ఫిబ్రవరి 28న రాత పరీక్ష నిర్వహించి ఆ తర్వాత రిజల్ట్​ రిలీజ్​ చేశారు.
స్కూల్​ అసిస్టెంట్లకు 3,152, లాంగ్వేజ్​ ​పండిట్స్​కు 4,102 మంది హాజరుకాగా, ఇందులో 50 శాతం మంది విద్వాన్, మధ్యమ విశారద లేదా వాటితో పీజీ చేసినవారే.

రూల్స్​కు అగెనెస్ట్​గా సెలక్షన్స్​ 

158 పోస్టులకుగానూ పలు కారణాలతో పదింటిని పక్కనపెట్టి 148 పోస్టులకు 1:3 రేషియో ప్రకారం మెరిట్​ అభ్యర్థులను గత ఏడాది అక్టోబర్​లో సెలెక్ట్​ చేశారు. ఈ లిస్టు డీఈవోల దగ్గరకి వచ్చినప్పటికీ వారికి ఇంకా పోస్టింగులు ఇవ్వకుండా పెండింగ్​లో పెట్టారు. రిజెక్టెడ్​ లిస్ట్​ఇప్పటికీ ప్రకటించకపోవడంపై అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 148 పోస్టులకు విద్వాన్, మధ్యమ విశారదలతో పీజీ చేసినవారు 90 మందికి పైగా సెలెక్ట్​ అయినట్టు సమాచారం. హిందీ లాంగ్వేజ్​ పండిట్​ పోస్టులకు సర్టిఫికెట్​వెరిఫికేషన్​ ప్రక్రియ కొనసాగుతోంది. వాస్తవానికి విద్వాన్, మధ్యమ విశారద సర్టిఫికెట్లు గ్రాడ్యుయేషన్​కు సమానం కాదని, వాటికి యూజీసీ గుర్తింపు లేదని నోటిఫికేషన్​లో తొలగించారు. అయినప్పటికీ కనీసం డిగ్రీలో సెకండ్ ​లాంగ్వేజ్​గా హిందీ చదవకుండా విద్వాన్, మధ్యమ విశారదలతో పీజీ చేసిన వారిని సెలెక్ట్​చేశారు. అదర్ గ్రాడ్యుయేషన్​ ఆప్షన్​లో డిగ్రీలో సెకండ్ ​లాంగ్వేజ్ ​హిందీ లేదా మూడేళ్ల బీవోఎల్​ చేసినవారే అర్హులని మిగతా అభ్యర్థులు పేర్కొంటున్నారు. యూజీసీ 1985/2013/2014  రెగ్యులేషన్స్​ ప్రకారం గ్రాడ్యుయేషన్​లో సెకండ్​ లాంగ్వేజ్​గా హిందీ చదవకుండా పోస్ట్​ గ్రాడ్యుయేషన్​చేసినా, ఆ డిగ్రీతో యూజీసీ నెట్​అర్హత పొందినా చెల్లుబాటు కాదంటున్నారు. అలాగే హిందీ లాంగ్వేజ్​పండిట్స్​గా పనిచేస్తున్న వారు స్కూల్​ అసిస్టెంట్​ ప్రమోషన్​ రావడం లేదని పోస్టులకు పోటీపడ్డారు. ఒక్క కరీంనగర్​ జిల్లాలోనే 24 పోస్టులకు గాను 12 మంది వాళ్లే ఉన్నారు.

అర్హులనే సెలక్ట్ చేయాలి

ఇదే నోటిఫికేషన్​లో తెలుగు స్కూల్​అసిస్టెంట్లకు జీవో ఎంఎస్​ నంబర్​ 25లో పేర్కొన్న క్వాలిఫికేషన్​ ప్రకారం అభ్యర్థులను సెలక్ట్​ చేసినట్లుగానే హిందీ స్కూల్​అసిస్టెంట్, లాంగ్వేజ్​ పండిట్​ రిక్రూట్​మెంట్​ చేపట్టాలని మిగతా అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. హెచ్ సీయూ, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలలో రెగ్యులర్​గా గ్రాడ్యుయేషన్​, పోస్ట్​ గ్రాడ్యుయేషన్​ చదివిన, అంబేద్కర్, ఉస్మానియా, కాకతీయ ఓపెన్​ యూనివర్సిటీల నుంచి డిగ్రీ, పీజీ చేసిన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ హిందీ సెలక్షన్ లిస్ట్​ను పునఃపరిశీలన చేసి జీవో 25 ప్రకారం సరైన క్వాలిఫికేషన్స్​ కలిగిన అభ్యర్థులను సెలక్ట్​ చేయాలని తెలంగాణ ఆల్​ యూనివర్సిటీ హిందీ జాక్​ ప్రెసిండెంట్​ఎం.యాదగిరి, జీవో 25 పరిరక్షణ సమితి ప్రెసిడెంట్​ పి.సత్యనారాయణ డిమాండ్​ చేశారు.