బ్యూటీ పార్లర్ ముసుగులో రూ. 3 కోట్లు మోసం చేసిన కిలాడీ దంపతులు

బ్యూటీ పార్లర్ ముసుగులో రూ. 3 కోట్లు మోసం చేసిన కిలాడీ దంపతులు

బ్యూటీ పార్లర్ పేరుతో కిలాడీ దంపతులు ఘరానా మోసం చేశారు. "రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్" పేరుతో మూడు కోట్ల వసూళ్లు చేసి మాయమైయ్యారు. వివరాల్లోకి వెళితే.. యూట్యూబ్ ఛానెళ్లతో యాడ్స్ చేసి.. అక్క సమీనా, బావ ఇస్మాయిల్, మరదలు జెస్సికా కస్టమర్లను ఆకర్షించారు. బ్యూటీపార్లర్ ఫ్రాంచైజీలు అంటూ జనాలకు ఎర వేసి.. అందినకాడికి దోచుకున్నారు. గతంలోను చిట్ ఫండ్ పేరుతో కోట్ల రూపాయలు మోసం చేసినట్టు వీరిపై ఆరోపణలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. 

మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో వందల సంఖ్యలో బాధితులు వీరి మోసానికి భాదితులు ఉన్నారని పేర్కొన్నారు. వీరు ఒక్కో బ్యూటీ పార్లర్ ఫ్రాంచైజీ కోసం రూ. 3 లక్షల 20 వేలు వసూలు చేసినట్లు తెలిసింది. వసూలైన మొత్తంతో ఉడాయించినట్లు తెలుస్తుంది. ఫ్రాంచైజీ తీసుకుంటే నెలకి రూ. 35 వేలు జీతం ఇస్తామని నమ్మించిన దంపతులు సమీనా, ఇస్మాయిల్ మాయమాటలు చెబుతారని.. వారి మాటలు నమ్మి కొందరు మహిళలు మంగళ సూత్రాలు అమ్మి, అప్పు చేసి ఫ్రాంచైజీ తీసుకున్నారని సమాచారం.  బాధితులకు రెండు, మూడు నెలల పాటు జీతం ఇచ్చి.. ఆ తర్వాత రేపుమాపంటూ కాలం వెళ్లదీశారు. 

జీతాల కోసం కాల్ చేస్తే.. ఫోన్లు స్విచ్ఛాఫ్ పెట్టుకున్నారు. దీంతో అనుమానం వచ్చి హైదరాబాద్ లోని ప్రగతి నగర్ హెడ్ ఆఫీస్ కి వెళ్లగా తాళం వేసి ఉండటంతో మోసపోయామని గ్రహించిన బాధితులు బావురమంటున్నారు. ఆరునెలల నుంచి ప్రగతినగర్ బ్రాంచ్ మూసివేసి ఉందని స్దానికులు తెలిపారు. భాదితులు బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.