మిర్యాలగూడ, వెలుగు: కరోనా పరీక్ష కోసం వచ్చిన మహిళ హాస్పిటల్ దగ్గరే చనిపోయిన విషాద సంఘటన మిర్యాలగూడలో జరిగింది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ(65) మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో యాంటీ జెన్ ర్యాపిడ్ టెస్ట్ సెంటర్ లో కరోనా టెస్ట్ కోసం ఎక్కువ సేపు లైన్ లోనే ఉండాల్సి వచ్చింది. దీంతో అసలే అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె అక్కడే ప్రాణాలు విడిచింది. మరణించిన 10 నిమిషాల తర్వాత పరీక్షలు చేయగా ఆమెకు కరోనా పాజిటివ్ రిజల్ట్ వచ్చిందని వెల్లడించారు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ సమరద్. దీంతో ఆమెను చాలాసేపు టెస్ట్ సెంటర్ వద్దనే ..స్టచర్ పై ఉంచారు. విషయం తెలియగానే హాస్పిటల్ లోని పేషెంట్లు.. పరీక్షల కోసం వచ్చినవారు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ముందుగానే పరీక్షలు చేసి ఉంటే ఆమె జాగ్రత్తలు తీసుకునేదని మండిపడుతున్నారు జనం. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఎక్కువ సంఖ్యలో టెస్టింగ్ కిట్స్ అందుబాటులో ఉంచితే లక్షణాలున్నవారు పరీక్షలు చేసుకుంటారన్నారు. మరణించిన మహిళతో లైన్ లో ఎంత మంది ఉన్నారో తెలియని పరిస్థితి అని భయంగా ఉన్నామని చెబుతున్నారు.
మొన్న ఆంధ్రాలోనూ..
ఇటీవల ఆంధ్రాలో కూడా ఇలాగే ఓ యువకుడు టెస్ట్ కోసం లైన్లో నిలబడి చనిపోయిన విషయం తెలిసిందే. చాలా వరకు సింటమ్స్ లేకుండా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. లక్షణాలు ఉన్నోళ్లు టెస్ట్ చేయించుకోవడానికి సెంటర్ కి వెళ్తే, టెస్టింగ్ కిట్స్ అందుబాటులో లేని పరిస్థితి. టెస్టింగ్ చేయించుకోవడానికి కిట్స్ లేని సమయంలో ..ఆ వ్యక్తులకు కరోనా ఉంటే వాళ్ళ ఆరోగ్యం ఇంకా క్షీణించిపోతుంది. ఒకవేళ అలాంటి వాళ్లకు పాజిటివ్ ఉంటే వాళ్లతో ఇంకో నలుగురికి కరోనా సోకే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇలా ఏజ్ పైబడిన వాళ్లు కూడా ఒకే లైన్లో నిలబడి నానా అవస్థలు పడుతున్నారు. పరీక్షల కోసం వచ్చి ఇలా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వైద్యాధికారులు సరైన సమయంలో టెస్టింగ్ కిట్స్ అందుబాటులో ఉంచి, వేగంగా పరీక్షలు నిర్వహించాలంటున్నారు. ఏజ్ పైబడినవారిని లైన్లో నిలబడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలంటున్నారు.