
పెబ్బేరు, వెలుగు: లక్ష రూపాయల బ్యాంకు లోన్ మాఫీ చేసేందుకు మంత్రి, కలెక్టర్ వస్తున్నారని చెప్పి పింఛన్ల పింపిణీ ప్రోగ్రామ్కు తీసుకొస్తరా అని ఆఫీసర్లు, లోకల్ టీఆర్ఎస్ లీడర్లపై మహిళా సంఘాల మెంబర్లు ఫైర్ అయ్యిన్రు. ప్రభుత్వం ఆసరా ఫించన్లు పెంచిన సందర్భంగా శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్రెడ్డి, వనపర్తి కలెక్టర్ శ్వేతా మహంతి పెబ్బేరులో వృద్ధులకు ప్రోసీడింగ్స్ ఇచ్చారు. అయితే ఈ ప్రోగ్రామ్ గ్రాండ్గా చేయడం కోసం స్థానిక ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు లోన్ మాఫీ చేయిస్తమని చెప్పి మహిళలు పెద్ద సంఖ్యలో తీసుకొచ్చారు. అయితే ప్రోగ్రామ్ మొత్తం అయిపోయినా మంత్రి, కలెక్టర్ బ్యాంకు లోన్ మాఫీ గురించి ఒక్క మాట మాట్లడకపోవడంతో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.లోన్ మాఫీ అంటూ అబద్ధాలు చెప్పి సభకు తీసుకొస్తరా అని ఆఫీసర్లు, టీఆర్ఎస్ లీడర్లపై ఫైర్ అయ్యారు. రోజు కూలీ చేసుకొనే మేం ఎంతో ఆశతో సొంత చార్జీలు పెట్టుకొని గ్రామానికి యాభై అరవై మందికి పైగా వచ్చామని గొడవపడ్డారు.