ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ప్రమ్ హోం.. చంద్రబాబు సంచలన హామీ

 ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ప్రమ్ హోం.. చంద్రబాబు సంచలన హామీ

ఏపీ ఎన్నికలు దగ్గరకొస్తున్న వేళ నేతలు ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు సభలు నిర్వహిస్తు కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనకాపల్లిలో నిర్వహించిన సభలో ఎన్నికల హామీలు ఇచ్చారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు.

 ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ. 1,500 ఇస్తామని చంద్రబాబు తెలిపారు. తల్లికి వందనం పేరుతో పిల్లలకు రూ. 15 వేలు ఇస్తామని అన్నారు. ఆడబిడ్డల కోసం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు.  రైతును రాజుగా చేస్తామని.. ఏడాదికి రూ. 20 వేల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి నెల ఒకటో తేదీన ఇంటి వద్దకే వచ్చి అందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పారు. 

పేదలకు 2 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని తెలిపారు. టిడ్కో ఇళ్లను ఉచితంగా ఇస్తామని చెప్పారు. సిద్ధం అన్న జగన్ సందిగ్ధంలో పడిపోయారని, ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా ట్రాన్స్ ఫర్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో జగన్ కు ఏబీసీడీలు కూడా తెలియవని చెప్పారు. జగన్ ను రాజకీయాల నుంచి తరిమేయాలని అన్నారు. అమరావతి మన రాజధాని, విశాఖ మన ఆర్థిక రాజధాని అని చెప్పారు.    

వచ్చే ఎన్నికల్లో వైసీపీని బంగాళాఖాతంలో కలపాలని అన్నారు. సైకో పాలన అంతం చేస్తే తప్ప మనకు భవిష్యత్తు లేదని అన్నారు. విశాఖను క్రైమ్ సిటీగా, గంజాయి కేంద్రంగా మార్చేశారని విమర్శించారు. ఏపీ పోలీసులు హైదరాబాద్ లో గంజాయి అమ్ముతూ దొరికిపోయారని చంద్రబాబు అన్నారు.