‘సింగరేణి కార్మికుల వేతనాల్లో కోత వద్దు‘

‘సింగరేణి కార్మికుల వేతనాల్లో కోత వద్దు‘

గోదావరిఖని, వెలుగుసింగరేణి కార్మికులు, ఉద్యోగుల వేతనాల నుంచి 50 శాతం కోత విధించడానికి యాజమాన్యం నిర్ణయించింది. కరోనా వ్యాధి నేపథ్యంలో ఉద్యోగుల వేతనాల నుంచి కోత విధించాలని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం సింగరేణి డైరెక్టర్‌‌ (పా) చంద్రశేఖర్‌‌ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. సింగరేణి సీఎండీ, డైరెక్టర్ల స్థాయి అధికారులకు 60 శాతం, జీఎంలు, ఇతర అధికారులు, ఎన్‌‌సీడబ్ల్యూఏ కార్మికులకు 50 శాతం వేతనాల్లో కోత విధిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మార్చి నెల వేతనాలను ఏప్రిల్‌‌ 3న చెల్లించనుండగా, ఆ రోజు ఈ కోత విధిస్తామని ఆయన తెలిపారు. కరోనా వైరస్‌‌ను నియంత్రించేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యే పరిస్థితి ఉండడంతో దానిని నింపేందుకు వేతనాల్లో కోత విధిస్తున్నట్టు ఆయన తెలిపారు. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత ఉన్నతస్థాయిలో సమీక్షించి అధికారుల అనుమతి పొందిన తర్వాత ఈ కోత విధించిన సొమ్మును తిరిగి చెల్లించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

అయితే ఈ విధానాన్ని ప్రతిపక్ష కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సింగరేణి సంస్థ కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కంపెనీ కాదని, ఇందులో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉందని గుర్తు చేస్తున్నాయి. అలాగే వేతనాలు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వడం లేదని అంటున్నారు. పేమెంట్‌‌ఆఫ్‌‌ వేజెస్‌‌ యాక్ట్‌‌ ప్రకారం కోల్‌‌ ఇండియాలో జేబీసీసీఐ బోర్డు చేసుకున్న ఒప్పందాల మేరకు కోర్‌‌ కంపెనీ అయిన సింగరేణిలో వేతనాలు చెల్లిస్తారని నాయకులు చెబుతున్నారు. సింగరేణి సంస్థ ఏటా లాభాలు సాధిస్తూ కార్మికులకు, ఉద్యోగులకు ఆ లాభాల్లో వాటా పంచుతోంది. అంటే కంపెనీ నష్టాల్లోకి వెళ్లే అవకాశాలు లేవు. భూగర్భ గనులు, ఓపెన్‌‌కాస్ట్‌‌ ప్రాజెక్ట్‌‌లలో నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తిని చేస్తూ వివిధ విద్యుత్‌‌, సిమెంట్‌‌, ఇతర చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రవాణా చేస్తూ దేశ ప్రగతిలో కార్మికులు, ఉద్యోగులు, అధికారులు భాగస్వాములవుతున్నారు. అంటే పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులలానే సింగరేణి కార్మికులు కూడా అత్యవసర సేవల కిందకే వస్తారు. ఈ క్రమంలో వీరికి కూడా వేతనాలలో కోత విధించరాదనేది కార్మిక సంఘాల వాదన.

ఇప్పటికే ఒక రోజు జీతం ఇచ్చేందుకు నిర్ణయం

ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎక్కడికక్కడ లాక్‌‌డౌన్‌‌ ప్రకటించింది. అయితే బొగ్గును వెలికితీసి దేశానికి వెలుగులు పంచేందుకు సింగరేణి కార్మికులు మాత్రం గనులు, ఓసీపీలలో కరోనాను లెక్కచేయకుండా డ్యూటీ చేస్తున్నారు. సింగరేణి కార్మికులు భూగర్భంలోకి కిలోమీటర్ల దూరం వెళ్లి పని చేస్తున్న క్రమంలో వారికి ఆదాయపు పన్ను మినహాయించాలని అసెంబ్లీలో గతంలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. అలాంటిది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జీతాల్లో కోత నిర్ణయాన్ని సింగరేణి యాజమాన్యం అమలు చేయాలని చూస్తుండడాన్ని కార్మిక సంఘాలు, కార్మికులు తప్పు పడుతున్నారు. కరోనా వైరస్‌‌ కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలిచేందుకు సింగరేణి యాజమాన్యం, గుర్తింపు సంఘం కార్మికులు, ఉద్యోగుల ఒక రోజు వేతనం రూ.7.5‌‌0 కోట్లను ఇవ్వడానికి నిర్ణయించాయి. అయితే యాజమాన్యం మాత్రం 50 శాతం కోత విషయం తెలపకుండా, వారి అనుమతి తీసుకోకుండా  ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. కొన్నిచోట్ల తమ అనుమతి లేకుండా జీతంలో కోత విధించరాదంటూ కార్మికులు  యాజమాన్యానికి లేఖలు కూడా అందజేశారు. ఇదిలా ఉండగా సింగరేణిలో పనిచేసే కార్మికులు ఎక్కువ శాతం మంది ఏటా రూ.10 లక్షలకు పైగానే సంపాదిస్తారు. వారికి 30 శాతం మేర ఆదాయపు పన్ను వర్తిస్తుంది. అంటే ఏడాదిలో కనీసం రెండు నుంచి మూడు నెలల వేతనాన్ని వారు ఆదాయపు పన్ను రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇలా అనేక రూపాల్లో ఆర్థికంగా నష్టపోతున్న కార్మికులకు నేడు 50 శాతం వేతనంలో కోత విధించడమేమిటని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.

 అడ్డంకిగా కేవైసీ రూల్స్..పీఎఫ్ పైసలు వచ్చేదెట్ల