వన్డే వరల్డ్ కప్ వార్ కు ఇంకా వారం రోజులున్నా.. వార్మప్ మ్యాచ్ లు సెప్టెంబర్ 29 నుంచి మొదలు కానున్న సంగతి తెలిసిందే. క్రికెట్ యుద్ధంలో తమ సత్తా చూపించటానికి.. వాతావరణం అలవాటు పడటానికి.. స్థానిక పరిస్థితులను అంచనా వేయటానికి ఆయా జట్ల బలాబలాలను తెలుసుకోవటానికి ఈ వార్మప్ మ్యాచులు కీలకంగా మారనున్నాయి.
హైదరాబాద్ లో సెప్టెంబర్ 29న పాకిస్తాన్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న రెండు దేశాల జట్లు.. గురువారం హోటళ్లకే పరిమితం అయ్యాయి. సెప్టెంబర్ 29వ తేదీ మధ్యాహ్నం ఒకటిన్నరకు గ్రౌండ్ లోకి దిగనున్నాయి. ఈ మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా.. రెండు జట్లకు గెలుపు అనేది కిక్ ఇస్తుందనటంలో సందేహం లేదు. అయితే ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉంది. వర్షం వల్ల మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న అనుమానం కల్గుతోంది.
హైదరాబాద్ లో రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో వర్షాల వల్ల పాకిస్తాన్ మ్యాచ్ జరిగే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అయితే హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ వర్షం పడకపోతే బాగుండని కోరుకుంటున్నారు. చూద్దాం మరి వాన దేవుడు క్రికెట్ లవర్స్ కోరిక నెరవేర్చుతాడా లేదా అనేది.