
ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ లైసెన్స్ రద్దు అయింది. భారత రెజ్లింగ్ సమాఖ్య లైసెన్సును సస్పెండ్ చేస్తున్నట్లు ఇంటర్నేషనల్ రెజ్లింగ్ ఫెడరేషన్ ప్రకటించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటన జారీ చేసింది.
రద్దుకు కారణం...
ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికలు నిర్వహించడంలో డబ్ల్యూఎఫ్ఐ విఫలమైంది. అందుకోసమే తాము లైసెన్స్ ను రద్దు చేస్తున్నట్లు ఇంటర్నేషనల్ రెజ్లింగ్ ఫెడరేషన్ వెల్లడించింది. ఈ నిర్ణయంతో ఇండియన్ రెజ్లర్లు రాబోయే వరల్డ్ ఛాంపియన్షిప్లో పాల్గొనే వీలుండదు. సెప్టెంబరు 16 నుంచి ప్రపంచ ఛాంపియన్షిప్ టోర్నీ జరగనుంది. అయితే ప్రస్తుతం వరల్డ్ ఛాంపియన్ షిప్ లో పోటీ పడే అవకాశం లేకపోవడంతో భారత రెజ్లర్లు ‘తటస్థ అథ్లెట్లు’గా పోటీ పడాల్సి ఉంటుంది.
ఎన్నికలపై WFIకు లేఖ..
మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్పై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలతో డబ్ల్యూఎఫ్ఐ వివాదంలో చిక్కుకుంది. అయితే చరణ్ సింగ్ను పదవి నుంచి తప్పించాలని రెజ్లర్లు ఆందోళన చేశారు. దీంతో WFI ప్యానెల్ను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ రద్దు చేసింది. ఆ తర్వాత WFI కార్యకలాపాల నిర్వహణను అడ్హక్ కమిటీకి అప్పగించింది. ఆగస్టు 27న ఈ కమిటీ ఏర్పాటైంది. అక్కడి నుంచి 45 రోజుల్లోగా WFI ప్యానెల్కు ఎన్నికలు నిర్వహించాలి. ఈ ఎన్నికలపై అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య 2022 మే 30న భారత రెజ్లింగ్ సమాఖ్యకు లేఖ రాసింది. అప్పటిలోగా ఎన్నికలు నిర్వహించకుంటే గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది. అయితే అప్పటి నుంచి పలు కారణాలతో ఈ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. చివరిసారిగా ఆగస్టు 12వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించగా.. దానికి ఒక రోజు ముందు పంజాబ్ -హరియాణా హైకోర్టు ఈ ఎన్నికలపై స్టే విధించింది. దీంతో ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే ప్రపంచ రెజ్లింగ్ సంఘం.. భారత రెజ్లింగ్ ఫెడరేషన్ పై వేటు వేసింది.