న్యూఢిల్లీ: వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్షిప్స్లో పాల్గొనే ఇండియా రెజ్లర్లను ఎంపిక చేయడానికి ఈ నెల 25, 26వ తేదీల్లో పటియాలలో ట్రయల్స్ నిర్వహిస్తామని అడ్హక్ ప్యానెల్ సోమవారం ప్రకటించింది. దాంతో, ఈ టోర్నీ సెలెక్షన్ ప్రాసెస్పై ఎనిమిది వారాల సస్పెన్స్కు తెరదించింది. ఆసియా గేమ్స్ ట్రయల్స్లో బజ్రంగ్ పునియా, వినేశ్ పొగాట్కు మినహాయింపు ఇవ్వడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.
అయితే, వరల్డ్ చాంపియన్షిప్స్కు మాత్రం ఎవ్వరికీ మినహాయింపు ఇవ్వడం లేదు. సెప్టెంబర్ 16-–24వ తేద్లీలో బెల్గ్రేడ్లో జరిగే ఈ టోర్నీ 2024 పారిస్ ఒలింపిక్స్కు తొలి క్వాలిఫయింగ్ ఈవెంట్ కానుంది. అన్ని వెయిట్ కేటగిరీల్లో ఇంటర్నేషనల్ ఈవెంట్లలో ఇది వరకు మెడల్స్ గెలిచిన వాళ్లు, పోటీ పడ్డ వాళ్లు ట్రయల్స్లో పాల్గొన వచ్చని అడ్హక్ కమిటీ తెలిపింది.
ఒక్కో వెయిట్ కేటగిరీలో ఎనిమిది మంది కంటే తక్కువ రెజ్లర్లు వస్తే నార్డిక్ సిస్టమ్తో ట్రయల్స్ నిర్వహిస్తామని తెలిపింది. ఇందులో ప్రతి రెజ్లర్ ఇతర పోటీదారులతో ఒక్కోసారి తలపడుతాడు. ఎక్కువ విజయాల ఆధారంగా ర్యాంకింగ్ ఇస్తారు. టాప్3 రెజ్లర్లకు మెడల్స్ ఇస్తారు. ఒకవేళ ఎనిమిది కంటే ఎక్కువ మంది ఉంటే డైరెక్ట్ ఎలిమినేషన్ ఫార్మాట్లో ట్రయల్స్ నిర్వహిస్తారు.