ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో భారత్ ఓటమి దిశగా పయనిస్తోంది. 164/3 ఓవర్ నైట్ స్కోర్ తో చివరి రోజు ఆట ఆరంభించిన భారత్ను స్కాట్ బోలాండ్ దెబ్బకొట్టాడు. ఒకే ఓవర్లో విరాట్ కోహ్లీ(49), రవీంద్ర జడేజా(0)ను ఔట్ చేసి టీమిండియాను కష్టాల్లోకి నెట్టాడు. ప్రస్తుతం టీమిండియా స్కోర్.. 183/5.
78 బంతుల్లో 7 ఫోర్లతో 49 పరుగులు చేసిన కోహ్లీ, స్కాట్ బోలాండ్ బౌలింగ్లో స్టీవ్ స్మిత్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత జట్టు 179 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా, రెండో బంతికే అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఈ మ్యాచులో టీమిండియా విజయం సాధించాలంటే ఇంకా 265 పరుగులు కావాలి. కనీసం డ్రా చేసుకోవాలన్నా.. 83 ఓవర్ల పాటు వికెట్లు కాపాడుకోగలగాలి. ఈ రెండు కష్టమే. ప్రస్తుతం అజింకా రహానే(30), శ్రీకర్ భరత్(4) క్రీజులో ఉన్నారు. ఇక మిగిలిన బ్యాటర్ ఒక్క శార్దూల్ ఠాకూర్ మాత్రమే. మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ మెరుపులు మెరిపించినా వారి నుంచి భారీ ఇన్నింగ్స్లు ఆశించడం అత్యాశే అవుతుంది.