
డబ్ల్యూటీసీ ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్లో 469 పరుగుల భారీ స్కోర్ చేసిన ఆసీస్.. రెండో ఇన్నింగ్స్ను 270 వద్ద డిక్లేర్ చేసింది. దాంతో, భారత్ ముందు 444 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం భారీ చేధనకు దిగిన భారత బ్యాటర్లు.. పడుతూలేస్తూ ప్రయాణం సాగిస్తున్నారు. శుభ్మాన్ గిల్(18), రోహిత్ శర్మ(43), ఛటేశ్వర్ పుజారా(27) నిరాశ పరచగా.. విరాట్ కోహ్లీ- అజింక్యా రహానే జోడి భారత్ను ఓటమి నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.
444 పరుగుల చేధనకు దిగిన భారత ఓపెనర్లు దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు. గిల్, రోహిత్ పోటాపోటీగా బౌండరీలు బాదుతూ వన్డే తరహాలో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. అయితే థర్డ్ అంపైర్ భారత జోరుకు బ్రేకులు వేశాడు. తప్పుడు నిర్ణయంతో గిల్(18)ని పెవిలియన్ బాట పట్టించాడు. ఆ తరువాత రోహిత్- పుజారా జోడి కాసేపు పోరాడనప్పటికీ.. వరుస ఓవర్లలో వీరిద్దరూ అవుట్ అవ్వడంతో టీమిండియాని కష్టాల్లోకి నెట్టింది.
ఆపై క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ- అజింక్యా రహానే నిలకడగా ఆడుతూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరి కలిసి 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నాలుగో రోజు ఆట ముగిసేసమయానికి భారత్.. 3 వికెట్ల నష్టానికి 164పరుగులు చేసింది. కోహ్లీ(44), రహానే(20) పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా విజయానికి ఇంకా 280 పరుగులు కావాలి.