ఇంగ్లండ్‌ చేరిన టీమిండియా.. కొత్త జెర్సీతో క్రికెటర్లు

ఇంగ్లండ్‌ చేరిన టీమిండియా.. కొత్త జెర్సీతో క్రికెటర్లు

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ కోసం ఇంగ్లండ్ చేరుకున్న భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ షురూ చేశారు. ఈ క్రమంలో బీసీసీఐ కొత్త ట్రైనింగ్ కిట్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త జెర్సీల్లోనే ఇంగ్లండ్ వెళ్లిన తొలి బ్యాచ్ ప్రాక్టీస్ చేస్తోంది. పేస్ బౌలర్లు ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ తో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాబ్రే.. ఇతర సపోర్టింగ్ స్టాఫ్ కొత్త జెర్సీలలో కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

బీసీసీఐ ఇటీవల అడిడాస్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కిల్లర్ జీన్స్ భారత జట్ల కిట్ స్పాన్సర్ గా ఉండగా, మే 31తో ఆ ఒప్పందం ముగియనుంది. ఆ తర్వాత అడిడాస్ డీల్ ప్రారంభమై.. మార్చి, 2028 వరకూ కొనసాగనుంది. ఇండియా మెన్స్, వుమెన్స్, అండర్ 19 జట్లకు జెర్సీలు, కిట్స్, ఇతర సామగ్రిని అడిడాస్ అందించనుంది. కొత్త జెర్సీల్లోనే భారత ఆటగాళ్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో బరిలోకి దిగనున్నారు. ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11వ తేదీ వరకూ ఈ ఫైనల్ జరగనుంది.

కాగా, 2021 టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమిండియా.. న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మొట్టమొదటి డబ్ల్యూటీసీ ట్రోఫీ గెలిచే అవకాశం చేజార్చుకున్న టీమిండియా ఈసారి ఎలాగైనా టైటిల్‌ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో పటిష్ట ఆసీస్‌ను ఢీకొట్టేందుకు అన్ని విధాలా సిద్ధమవుతోంది. అందుకోసం ఇప్పటికే కొందరు ఆటగాళ్లు ఇంగ్లండ్ చేరుకొని ప్రాక్టీస్ లో తలమునకలై ఉండగా, మరికొందరు ఐపీఎల్ టోర్నీ ముగియగానే బయలుదేరి వెళ్లనున్నారు. 

డబ్ల్యూటీసీ ఫైనల్‌ –2023లో తలపడబోయే భారత జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్ కీపర్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్‌ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.

స్టాండ్‌ బై ప్లేయర్స్: రుతురాజ్‌ గైక్వాడ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ముకేశ్‌ కుమార్‌.

https://twitter.com/BCCI/status/1661702012352724998